‘‘చార్ ధామ్’’ యాత్ర ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక యాత్రికులు తమ తీర్థయాత్ర తేదీలను ప్లాన్ చేసుకుని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రతి ఏడాది మాదిరిగానే దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి వస్తుంటారు. అయితే, భక్తుల సౌకర్యార్ధం ఎప్పటిలాగే ఈసారి కూడా రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసింది అధికార యంత్రాంగం. రిజిస్ట్రేషన్ కోసం అధికారిక పోర్టల్, మొబైల్ యాప్ను ఏర్పాటు చేసింది.
అదేవిధంగా యాత్రకు రెండు రోజుల ముందు (ఏప్రిల్ 17)న ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం రిషికేశ్, హరిద్వార్, దేహ్రాదూన్లో కౌంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరుచుకోవడంతో తీర్థయాత్ర ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 22న కేదార్నాథ్, ఏప్రిల్ 23న బద్రీనాథ్లో తలుపులు తెరుచుకుంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్రికులు ప్రయాణ సమయంలో రిజిస్ట్రేషన్ స్లిప్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.
చార్ధామ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకోవడానికి భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెండు సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. వెబ్ పోర్టల్: registrationandtouristcare.uk.gov.in సందర్శించి నమోదు చేసుకోవచ్చు. అలాగే, మొబైల్ యాప్: Tourist Care Uttarakhand యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు.
చార్ధామ్ యాత్ర -ఏప్రిల్ 19న ప్రారంభం
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ- మార్చి 6
యమునోత్రి గంగోత్రి ద్వారాలు- ఏప్రిల్ 19
కేదార్నాథ్- ఏప్రిల్ 22
బద్రీనాథ్- ఏప్రిల్ 23
ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కోసం 50 కౌంటర్లు ఏర్పాటు
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం