మదర్సాలలో ఆపరేషన్‌ సిందూర్‌

ఆపరేషన్‌ సిందూర్‌ను మదర్సాలలో పాఠ్యాంశంగా చేరుస్తామని ఉత్తరాఖండ్‌ మదర్సా ఎడ్యుకేషన్‌ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ షామూన్‌ ఖాస్మీ తెలిపారు. పిల్లలకు ధైర్యం, జాతీయ ఐక్యతను నేర్పడానికి ఉత్తరాఖండ్‌ మదర్సా బోర్డు 2025 నుంచి పాఠ్యాంశాల్లో ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను చేర్చనుందని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ముస్లిం బోర్డు సమావేశం అయిన తర్వాత బోర్డు చైర్మన్‌ ముఫ్తీ షామూన్‌ ఖాస్మీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముస్లిం సమాజమంతా ప్రధాని మోడీతో ఉన్నామని.. ముస్లింల అభిప్రాయాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలియజేసినట్లు చెప్పారు. ఇక మదర్సాలలో చదువుతున్న పిల్లలకు ఆపరేషన్‌ సిందూర్‌ గురించి నేర్పిస్తామని తెలిపారు. పాకిస్థాన్‌.. మన అమాయక పౌరులను చంపిందన్నారు. దేశం ముఖ్యమైనది కాబట్టే.. ఆపరేషన్‌ సిందూర్‌ను సిలబస్‌లో చేరుస్తున్నట్లు చెప్పారు.

విజయవంతమైన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి పిల్లలకు నేర్పిస్తే.. మన సైనికుల శక్తి, ధైర్యం ఏమిటో తెలుస్తుందన్నారు.  ప్రాణనష్టం జరగకుండా ఎలా యుద్ధం చేయాలో భవిష్యత్‌ తరాలు అర్థం చేసుకుంటాయని పేర్కొన్నారు.

గత ప్రభుత్వాలు ముస్లిం సమాజాన్ని ప్రధాన స్రవంతి సమాజం నుంచి దూరం చేశాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి నాయకత్వంలో మదర్సాలు జాతీయ ఐక్యత, అవగాహనకు దోహదపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *