ప్రపంచ మార్కెట్ శక్తులు భారతీయ వ్యవసాయాన్ని దెబ్బతీస్తున్నాయి : భాగయ్య
ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయంపై హైదరాబాద్ కేశవ మెమోరియల్ లో సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భాగయ్య ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో సేంద్రీయ పద్ధతి ద్వారా రైతులు అధికంగా పండిస్తున్న పత్తి పంటపై, వారి విజయ పరంపరలను ప్రస్తావించారు.వ్యవసాయ ఉత్పాదకత మరియు సుస్థిరత పెంపొందడంలో సేంద్రీయ పద్ధతులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మధ్యప్రదేశ్, అసోం, సిక్కిం, గుజరాత్ సహా పలు రాష్ట్రాలు సేంద్రీయ వ్యవసాయంతో ఉత్పత్తులు చేస్తూ విజయపథంలో వున్నాయన్నారు.
ఇక.. దిగుమతి చేసుకున్న పామాయిల్ పై భారత్ అధికంగా ఆధారపడుతోందని, దీంతో దేశానికి 70 వేల కోట్లు ఖర్చవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో ఆహారపు అలవాట్లు రకరకాలుగా వుంటాయని, వాటికి సరిపోయే విభిన్న స్థానిక నూనెలు తిరిగి రావాలని అన్నారు. ప్రపంచ మార్కెట్ శక్తులు భారతీయ వ్యవసాయ పద్ధతులపై తమ ఇష్టాలను రుద్దుతున్నారని అన్నారు. విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలపై ఆధారపడం బాగా పెరిగిందని, దీనిని తగ్గించుకోవాలని సూచించారు. ఇలాంటి పద్ధతులతో భారతీయ వ్యవసాయం తన లక్షణాల్ని, స్వయంప్రతిపత్తిని కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే స్థానికంగా వుండే పద్ధతులను కూడా దెబ్బతీస్తోందన్నారు.