పహల్గాం ఉగ్రదాడి బాధితులను స్మరించుకుంటూ గురేజ్ వ్యాలీలో ‘‘తిరంగా ర్యాలీ’’
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ, ఉగ్రదాడి బాధితులను స్మరించకుంటూ యావత్ దేశ ప్రజలు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలోని అత్యంత సుందరమైన గురేజ్ వ్యాలీ సాక్షిగా, పహల్గామ్ ఉగ్రదాడి బాధితులను స్మరించుకుంటూ.. స్థానిక ప్రజలు భారీ ‘తిరంగా ర్యాలీ’ నిర్వహించారు.ఈ ర్యాలీలో దవార్, పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది జనం తిరంగా ర్యాలీలో భాగస్వాములయ్యారు. పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని “భారత్ మాతా కీ జై” అంటూ చేసిన నినాదాలు లోయలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి.
మాజీ సైనికులు, స్థానిక టూర్ ఆపరేటర్లు, పౌర సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. “తుపాకీ గుండుతో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. అమరవీరుల త్యాగం వృధా పోదు, వారు చూపిన ధైర్యమే మాకు మార్గదర్శకం,” అంటూ స్థానికులు ఉద్వేగానికి లోనయ్యారు. సందర్భంగా విద్యార్థులు శాంతి, ఐక్యత, సహనం గురించి అర్థవంతమైన సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. దేశ సమగ్రతను, శాంతిని కాపాడతామని ప్రతి ఒక్కరూ ప్రమాణం చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిమిషం పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.