భారత్ మనోభావాలను మరోసారి దెబ్బతీసిన పాక్
జమ్మూ కశ్మీర్, ఆర్టికల్ 370 విషయంలో భారత దేశ మనోభావాలను దెబ్బతీస్తూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటి విషయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరికే మద్దతిస్తున్నామని ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పాక్ ఇలా స్పందించడం చూస్తుంటే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్ కి సంబంధించిన జియో న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి ఖవాజా ఆసీఫ్ మాట్లాడారు.
ఆర్టికల్ 370 ని పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆర్టికల్ 370 విషయంలో తాము నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ విధానంతోనే ఏకీభవిస్తున్నామని ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లో ఈ రెండు పార్టీలు అధికారంలోకి వస్తాయని ప్రకటించారు. అవి అధికారంలోకి వస్తాయి కాబట్టి, ఈ అంశాలు సాధ్యమవుతాయని ఆయన అన్నారు.
మరోవైపు పాక్ మంత్రి ప్రకటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. పాక్, కాంగ్రెస్ ఎప్పుడూ ఒకే గొంతు వినిపిస్తాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వైఖరి ఏమిటో మరోసారి ప్రజలకు తెలిసిపోయిందన్నారు. దేశ వ్యతిరేకులతో కాంగ్రెస్ చేయి కలుపుతోందని మండిపడ్డారు. ఆర్టికల్ 370, 35 ఏ పునరుద్ధరణ విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ వైఖరి బట్టబయలైందన్నారు. పాక్, కాంగ్రెస్ ఎజెండాలు ఒకేటనన్నారు.