గంటల్లోనే కాల్పుల విరమణకు పాక్‌ తూట్లు

కాల్పుల విరమణకు భారత్‌, పాకిస్థాన్‌ అంగీకరించిన కొన్ని గంటల్లోనే అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్థాన్‌ ఒప్పంద ఉల్లంఘనకు తెగబడింది. జమ్ము కశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లోని అనేక నగరాలపై డ్రోన్ల దాడి కొనసాగింది. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు ఎక్కడైనా జరిగితే పూర్తి స్థాయిలో ఎదుర్కొనాలని బీఎస్‌ఎఫ్‌ను ప్రభుత్వం ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
శ్రీనగర్‌తోసహా జమ్ము కశ్మీర్‌లోని అనేక చోట్ల పేలుళ్లు సంభవించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మూడు రోజుల్లో ఇదే అతిపెద్ద డ్రోన్‌ దాడిగా పేర్కొన్నాయి. కశ్మీర్‌లోని బారాముల్లాతోపాటు రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో పాకిస్థానీ డ్రోన్లను భారత భద్రతాదళాలు కూల్చివేశాయి. శ్రీనగర్‌తోపాటు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో శనివారం రాత్రి విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపివేసి బ్లాకౌట్‌ విధించారు.
అంతర్జాతీయ సరిహద్దుల వెండి అఖ్నూర్‌, రాజౌరీ, ఆర్‌ఎస్‌ పురా సెక్టార్లలో పాకిస్థాన్‌ సైన్యం భారీగా కాల్పులు జరిపింది. జమ్ముకు చెందిన పలన్‌వాలా సెక్టార్‌లో ఎల్‌ఓసీ వెంబడి కూడా పాకిస్థాన్‌ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. బారాముల్లాలో భారత దళాలు ఓ డ్రోన్‌ను పేల్చివేశాయి. బారాముల్లాలోనే అనుమాస్పద మానవరహిత గగనతల వాహనాలు(యూఏవీలు) కనిపించాయి.
పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో బ్లాకౌట్‌ విధించారు. బారాముల్లా, శ్రీనగర్‌లో బ్లాకౌట్‌ అమలుచేశారు. మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తుల బేస్‌ క్యాంపు కాట్రాలో కూడా బ్లాకౌట్‌ అమలు చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌, లూథియానాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన అధికారులు ముందు జాగ్రత్తగా బ్లాకౌవుట్‌ విధించారు. జమ్ము ప్రాంతంలోని సాంబా జిల్లాలో వైమానిక దాడులకు సంబంధించిన హెచ్చరిక సైరన్లు మోగాయి.నగ్రోటా మిలిటరీ స్టేషన్‌లో శనివారం రాత్రి కొందరు వ్యక్తులు చొరబడి కాల్పులు జరిపినట్టు భారత సైన్యం ప్రకటించింది. సెంట్రీ స్వల్పంగా గాయపడ్డారని తెలిపింది. చొరబడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొంది.
భారత్‌తో కాల్పుల విరమణకు పాకిస్థాన్‌ అంగీకరించిన కొన్ని గంటల్లోనే శ్రీనగర్‌లో పేలుళ్లు శబ్దాలు వినిపించాయని జమ్ము కశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎల్‌ఓసీ వెంబడి కవ్వింపు కాల్పులకు పాకిస్థాన్‌ పాల్పడుతోందని ఆయన తెలిపారు. కాల్పుల విరమణకు ఏం జరిగింది? శ్రీనగర్‌వ్యాప్తంగా పేలుళ్లు వినపడుతున్నాయి’ అని ఎక్స్‌ పోస్టులో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పేలుళ్ల శబ్దాలు వినిపిస్తుండగా శ్రీనగర్‌కు చెందిన వీడియోను కూడా షేర్‌ చేశారు. ‘కాల్పుల విరమణ కాదు. శ్రీనగర్‌ మధ్యలో ఉన్న గగనతల రక్షణ యూనిట్లు ఇప్పుడే తెరుచుకున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి కొన్ని గంటలుగా పాకిస్థాన్‌ కాల్పులు జరుపుతుందని శనివారం రాత్రి తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని చాటడంపై ఆయన మండిపడ్డారు. డీజీఎఈంవో మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్‌దే అని విక్రమ్‌ మిస్రీ తెలిపారు.సరిహద్దుల్లో సైనికులు కాల్పుల విరమణకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు సూచించామని చెప్పారు. వాస్తవ పరిస్థితిని పాక్‌ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నామని, ఈ ఉల్లంఘనలను పాక్‌ నిలువరిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కాల్పుల ఉల్లంఘనలను నిరోధించడానికి భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని తెలిపారు. పాక్‌ అతిక్రమణలను నిలువరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని భారత ఆర్మీకి ఆదేశాలిచ్చామని చెప్పారు. సరిహద్దులో భారత సైన్యం ధీటుగా బదులిస్తోందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *