పార్లమెంటే అత్యున్నతం : ఉపరాష్ట్రపతి
పార్లమెంటే అత్యున్నతమైందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మరోసారి స్పష్టం చేశారు. పార్లమెంట్ కంటే మరే వ్యవస్థకు అత్యున్నత అధికారం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బిల్లులను ఉద్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నిర్దేశిత గడవులోగా రాష్ట్రపతి అయినా, గవర్నర్లు అయినా బిల్లులను క్లియర్ చేయాలని సుప్రీం కోర్టు పేర్కొన్నది.ఆ వ్యాఖ్యలను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తప్పుపట్టారు. రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే అధికారం న్యాయవ్యవస్థకు లేదని తెలిపారు. అయితే ఇవాళ మళ్లీ అదే అంశంపై ఆయన స్పందిస్తూ శాసన వ్యవస్థే అత్యున్నతమైందని, రాజ్యాంగం ఎలా ఉండాలన్న దాన్ని నిర్ణయించేది ఎన్నికైన ప్రజాప్రతినిధులే అని, అంతకు మించిన అధికారం ఎవరికీ లేదని జగదీప్ ధన్కర్ తేల్చి చెప్పారు.
ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన జరిగిన కార్యక్రమంలో ధన్కర్ పాల్గొంటూ “ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అన్నింటికీ జవాబుదారీగా ఉంటారు. అత్యవసర పరిస్థితిని విధించిన ప్రధానమంత్రి (ఇందిరా గాంధీ)ని కూడా జవాబుదారీగా ఉంచారు. ప్రజాస్వామ్యం అనేది ప్రజల కోసం మాత్రమే. అది ఎన్నికైన ప్రతినిధులకు రక్షణ కల్పించే ఓ భాండాగారం.” అని తెలిపారు.
“రాజ్యాంగం ఎలా ఉండాలో నిర్ణయించడంలో ఎన్నికైన ప్రతినిధులే అంతిమ యజమానులు. పార్లమెంట్ కంటే ఎక్కువ అధికారం ఉన్న వ్యవస్థ గురించి మన రాజ్యాంగంలో లేదు. కనుక మనం దేశంలో పార్లమెంటే సుప్రీం” అని ఉపరాష్ట్రపతి తేల్చి చెప్పారు. రాజ్యాంగ అధికారిగా తాను మాట్లాడే ప్రతి మాట అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీం కోర్ట్పై తాను చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూ విమర్శలు చేసిన వారిపై ఆయన మండిపడ్డారు.