శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధం… ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా మారుస్తామని ప్రకటన
శ్రీశైలం దేవస్థానం పర్యావరణ హితమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్రీశైలం దేవస్థానం , శ్రీశైలం పరిధిలో పూర్తిగా ప్లాస్టిక్ ఫై నిషేధం విధిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఆలయ ఆవరణతో పాటు శ్రీశైలం పరిధిలో ప్లాస్టిక్ బాటిల్స్ ని, ప్లాస్టిక్ కవర్లను కూడా ఇకపై విక్రయించకూడదని ప్రకటించారు. ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్ సంచులను వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ బాటిల్స్కి బదులుగా మట్టి, స్టీల్ , రాగి, గాజు బాటిల్స్ను భక్తులు మంచి నీటి కోసం వినియోగించుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఈవో అన్నారు.
అయితే… గతేడాది నుంచే ప్లాస్టిక్ శ్రీశైలంలో నిషేధం వుంది. కానీ… అధికారులు గానీ, భక్తులు గానీ అంతగా పట్టించుకోలేదు. ఇకపై అలా వుండదని, దీనిని పూర్తిగా అమలు చేస్తామని , కఠినంగానే వుంటామని అన్నారు. శ్రీశైలాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ,అందుకు భక్తులందరూ సహకరించాలని ఈవో కోరారు.హోటల్ యజమానులు, నిర్వాహకులు కూడా ఈ నిబంధనలు పాటించాలని అన్నారు. ఇకపై మరింత కఠినంగా వుంటామని, ప్రతి రోజూ తనిఖీలు చేపడతామని, అప్పటికీ మార్పులు రాకపోతే భారీ జరిమానాలు విధిస్తామన్నారు.