చార్ ధామ్ యాత్రలో ‘‘డిజిటల్ ఉపవాసం’’ చేద్దాం : ప్రధాని పిలుపు
చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. అనేక మంది భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భక్తులనుద్దేశించి, ఓ లేఖ రాశారు. అందులో ‘‘డిజిటల్ ఉపవాసన’’ ను ప్రతిపాదించారు. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. డిజిటల్ ఉపవాసం అంటే..చార్ ధామ్ యాత్రలో వున్న భక్తులు తమ ప్రయాణంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి వారికి పూర్తిగా దూరంగా వుండి డిజిటల్ ఉపవాసం పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే డిజిటల్ ఉపవాసం చేస్తూ, ఉత్తరాఖండ్ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని, దైవ నామ స్మరణ చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. అలాగే పుణ్య క్షేత్రాల వద్ద పరిశుభ్రంగా వుంచాలని, సింగిల్ యూజ్ ప్టాస్టిక్ కు దూరంగా వుండాలని కూడా సూచించారు. అలాగే బడ్జెట్ లో కనీసం 5 శాతం డబ్బుతో స్థానిక ఉత్పత్తుల కొనుగోలు, ప్రయాణ నియమ నిబంధనలు పాటించాలని కూడా మోదీ సూచించారు.
ఈ నెల 19 వ తేదీన గంగోత్రి, యమునోత్రి ద్వారాలు తెరుచుకున్నాయి. బుధవారం కేదార్ నాథ్ ఆలయ దర్శనాలు ప్రారంభమయ్యాయి. 15 క్వింటాళ్ల పూలతో కేదార్ నాథ్ ఆలయాన్ని హర హర మహాదేవ్ అంటూ తెరిచారు. గంగోత్రిలో జరిగిన పూజకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచ్చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ యాత్రకు భక్తులు సహకరించాలని ఆయన కోరారు.