మరోసారి కశ్మీర్ ను నాశనం చేయాలని చూస్తున్నారు : ప్రధాని మోదీ

పహల్గామ్ ఇస్లామిక్ ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. కశ్మీర్ శత్రువులు, దేశ వ్యతిరేకులు కలిసి జమ్మూ కశ్మీర్ అద్భుతమైన ప్రగతిని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నమే ఈ దాడి అని పేర్కొన్నారు. మన్ కీ బాత్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించారు. ఈ మధ్య కాలంలో జమ్మూ కశ్మీర్ అద్భుతమైన ప్రగతి పథంలో వెళ్తోందని, పర్యాటక రంగం కూడా వేగంగా వృద్ధి చెందుతోందని, పాఠశాలలు, కళాశాలలు కూడా పెరిగి, యువతకు అవకాశాలు పెరుగుతున్నాయని కశ్మీర్ లోని పరిస్థితులను వివరించారు.

ఈ ఉగ్రదాడి తనను ఎంతగానో కలిచివేసిందని మోదీ పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడ్డ వారి కుటుంబాలకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారతీయులకు ప్రపంచం మొత్తం అండగా నిలుస్తోందన్నారు. బాధిత కుటుంబాలకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని మరోసారి చెబుతున్నానని ప్రకటించారు.

మన్ కీ బాత్ లో మాట్లాడుతూ… పహల్గామ్ విషయాన్ని తాను ప్రస్తావిస్తున్నానని, ఈ విషయం చెప్పలేనంత బాధ మనసులో వుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఉగ్రదాడి దేశంలోని ప్రతి పౌరుడ్నీ బాధపెట్టిందన్నారు. అలాగే బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికీ ప్రగాఢ సానుభూతి కూడా వుందని, ప్రాంతాలు, భాషకు అతీతంగా అందరూ బాధపడుతున్నారని మోదీ అన్నారు.

‘‘కశ్మీర్ లో తిరిగి శాంతి నెలకొంటోంది. పాఠశాలలు, కళాశాలల్లో ఉత్సాహం నెలకొంది. ప్రజాస్వామ్యం కూడా బలోపేతం అవుతోంది. పర్యాటకమూ పెరిగింది. అక్కడి యువతకు కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. కానీ దేశ శత్రువులకు, కశ్మీర్ శత్రువులకు ఈ వాతావరణం, అభివృద్ధి నచ్చడం లేదు. మరోసారి కశ్మీర్ ను నాశనం చేయాలని చూస్తున్నారు.’’ అని మోదీ అన్నారు.

ఈ ఉగ్రదాడిపై ప్రపంచ నేతలు తనకు ఫోన్లు చేశారని, లేఖలు కూడా రాసి, ఈ ఉగ్రదాడిని ఖండించారని మోదీ వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు వుంటుందని కూడా హామీ ఇచ్చారని మోదీ గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *