అపరిమిత మానవ స్ఫూర్తికి నాసా క్రూ-9 మిషన్ పరీక్ష: ప్రధాని మోదీ
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ధైర్యానికి, అపరిమిత మానవ స్ఫూర్తికి నాసా క్రూ-9 మిషన్ పరీక్ష అని ప్రధాని మోదీ అన్నారు. సునీతా విలియమ్స్, క్రూ-9 వ్యోమగాములు పట్టుదల అంటే ఏంటో మరోసారి చూపించారంటూ కొనియాడారు. తెలియని విస్తారమైన పరిస్థితులను ఎదుర్కొన్నా చెక్కుచెదరని వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందంటూ ఎక్స్ వేదికగా మోదీ ప్రశంసించారు.
అంతరిక్ష అన్వేషణ అంటే మానవశక్తి పరిమితులను అధిగమించడం.. కలలు కనడం, వాటిని వాస్తవంగా మార్చే ధైర్యం కలిగి ఉండడమని ప్రధాని చెప్పారు. ఈ మార్గదర్శకాలు పాటించి సునీతా విలియమ్స్ తన కెరీర్ అంతటా స్ఫూర్తిని ప్రదర్శించారని మోదీ కొనియాడారు. అభిరుచి, కచ్చితత్వం, సాంకేతిక పట్టుదల కలిస్తే ఏం జరుగుతుందో ప్రదర్శించి చూపారని ప్రశంసించారు.