భారత్ ఇప్పుడు ప్రపంచ కార్ఖానా : ప్రధాని మోదీ
భారతీయ ఉత్పత్తులు విదేశాలకు వెళుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని చాటుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలిపారు. తన ‘స్థానికంకోసం ఎలుగెత్తి చాటాలి’ ప్రచారోద్యమం సత్ఫలితాలు సాధిస్తోందని ఆయన చెప్పారు. ఢిల్లీలో ఎన్ఎక్స్టి కాన్క్లేవ్లో ప్రధాని మాట్లాడుతూ, భారత్ అపరిమిత సృజనల భూమిగా మారుతోందని, అందుబాటులో పరిష్కారాలు కనుగొంటున్నదని, ప్రపంచానికి వాటిని సూచిస్తోందని తెలిపారు.
ఈ కాన్క్లేవ్లోనే ‘న్కూస్ఎక్స్ వరల్డ్’ చానెల్ను ఆవిష్కరించారు. ‘ప్రపంచం 21వశతాబ్దపు భారత్ను ఆసక్తితో పరికిస్తున్నది. ప్రపంచం అంతటి నుంచి ప్రజలు భారత్ను సందర్శించి అవగాహన చేసుకోవాలని వాంఛిస్తున్నారు’ అని మోదీ చెప్పారు. దేశం ఇప్పుడు తయారీ కేంద్రంగా, ‘ప్రపంచ కార్ఖానా’గా ఆవిర్భవిస్తోందని ప్రధాని వెల్లడించారు.
‘దశాబ్దాలుగా భారత్ను తమ పెరటి విభాగంగా ప్రపంచం పరిగణిస్తుండేది. ఇప్పుడు భారత్ ప్రపంచానికి కొత్త కర్మాగారంగా మారుతోంది. మేము ఇక ఎంత మాత్రం శ్రామికశక్తి కాము, కానీ దానికి బదులు ప్రపంచ శక్తిగా మారుతున్నాం’ అని మోదీ చెప్పారు. భారత పెరుగుతున్న రక్షణ ఉత్పత్తులు తమ ఇంజనీరింగ్, సాంకేతిక బలాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయని ప్రధాని ఉద్ఘాటించారు.
‘ఎలక్ట్రానిక్స్ నుంచి ఆటోమోబైల్ రంగం వరకు ప్రపంచం భారత స్థాయిని, సత్తాను తిలకించింది. భారత్ ప్రపంచానికి కేవలం ఉత్పత్తులను సమకూరుస్తుండడమే కాకుండా గ్లోబల్ సప్లయి చైన్లో విశ్వసనీయ, ఆధారపడదగిన భాగస్వామిగా మారుతోంది’ అని ప్రధాని చెప్పారు. వివిధ రంగాల్లో భారత నాయకత్వం ఏళ్ల తరబడి కఠిన శ్రమ, వ్యూహాత్మక విధాన నిర్ణయాల ఫలితమని ప్రధాని పేర్కొన్నారు.