పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందరకశించారు. అక్కడ వున్న సైనికులతో కలిసి పోయి, వారితో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఓ సైనికుడి భుజం తట్టి, అభినందించడం అందర్నీ ఆకట్టుకుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన భద్రతా బలగాలు ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ ను నిర్వహించాయి. దీంతో ఈ నెల 9,10 తేదీల్లో పాక్ దాడులకు ప్రయత్నించింది. పాకిస్తాన్ టార్గెట్ చేయాలని యత్నించిన వాటిలో ఈ ఆదంపూర్ వైమానిక స్థావరం కూడా ఒకటి. దీంతో ప్రధాని మోదీ ఇప్పుడు ఈ ఎయిర్ బేస్ నే సందర్శించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

”
ఈ ఉదయం నేను ఆదంపూర్ ఎయిర్ బేస్ కి వెళ్లాను. అక్కడ మన పోరాట యోధులను కలుసుకున్నాను. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపాలు వారు. వారితో ముచ్చటించడం ఓ ప్రత్యేక అనుభవం. మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతి చర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతోనే వుంటారు.’’ అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. అలాగే జవాన్లతో దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.