20 రోజుల పాటు దర్శనం వాయిదా వేసుకోండి : అయోధ్య ట్రస్ట్ అభ్యర్థన
అయోధ్యలో విపరీతమైన భక్తుల తాకిడి మొదలైంది. మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించి, రామ్ లల్లా దర్శనార్థం వచ్చేస్తున్నారు. 30 గంటల్లోనే 25 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. భక్తులందరూ తమ అయోధ్య దర్శనాన్ని 20 రోజుల వరకూ వాయిదా వేసుకోవాలని కీలక సూచనలు చేసింది. అయోధ్యలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని, అందుకే ఈ సూచనలు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ట్రస్ట్ ఓ ట్వీట్ చేసింది.
మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకి విపరీతమైన భక్తులు వస్తారు. దాదాపు ఆ ఒక్కరోజే 10 కోట్ల మంది కుంభమేళాకి వస్తారని అధికారులు పేర్కొంటున్నారు. 10 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. పవిత్ర స్నానాల తర్వాత అయోధ్య దర్శనానికి కూడా వస్తారు.సమీప ప్రాంతాల నుంచి వచ్చే వారు తమ దర్శనాన్ని 15 నుంచి 20 రోజుల వరకు వాయిదా వేసుకోండి. రాముడి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సులభ దర్శనం చేయించాల్సిన బాధ్యత మాపై వుంది. ఈ మేరకు భక్తులను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాం’’ అని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేర్కొంది.