న్యూటన్ కంటే ముందే గురుత్వాకర్షణ మన వేదాల్లో వుంది : రాజస్థాన్ గవర్నర్
రాజస్థాన్ గవర్నర్ హరిబావు బాగ్డే చరిత్ర విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జైపూర్ లోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ స్నాతకోత్సవం సందర్భంగా అసలైన భారతీయ చరిత్రను గుర్తు చేశారు. 1687 లో గురుత్వాకర్షణ సిద్ధాంతం న్యూటన్ గుర్తించడానికి పూర్వమే మన వేదాల్లో దాని గురించిన ప్రస్తావన వుందని తేటతెల్లం చేసేశారు. పురాతన కాలం నుంచీ భారత్ విజ్ఞాన కేంద్రంగా భాసిల్లుతోందని, నలంద యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలకు దేశ విదేశాల నుంచి విద్యార్థులు వచ్చి, విద్యనభ్యసించేవారని గుర్తు చేశారు. డెసిమల్ వ్యవస్థను భారతే ప్రపంచానికి అందించిందన్నారు.
నిజానికి గురుత్వాకర్షణ శక్తి గురించి మన వేదాల్లోనే వుందని, న్యూటన్ చాలా ఆలస్యంగా చెప్పారన్నారు. విద్యుత్తు గానీ, విమానాలు గానీ… ఇతరత్రా విషయాలు ఇతరత్రా విషయాలన్నీ వేదాల్లో వున్నాయని, చాలా అంశాలు రుగ్వేదంలోనే వున్నాయన్నారు. అయితే బ్రిటీషర్లు వచ్చిన తర్వాతే భారతీయ విజ్ఞానాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారన్నారు. ప్రస్తుతం పిల్లల్లో మేధో సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు భారతీయ విజ్ఞానం, సైన్స్ తో అనుసంధానం చేయాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు.
భారతదేశం ప్రాచీన కాలం నుండి విజ్ఞానం మరియు విజ్ఞాన శాస్త్రంలో గొప్పదని అన్నారు. భారతదేశంలో నలంద లాంటి గొప్ప విశ్వవిద్యాలయం ఉండేది. సుదూర దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారన్నారు. భక్తియార్ ఖిల్జీ నలంద లైబ్రరీని తగులబెట్టడాన్ని గవర్నర్ ప్రస్తావించారు. భారతీయ విజ్ఞానాన్ని నాశనం చేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే అవి విజయవంతం కాలేదని అన్నారు. ప్రాచీన కాలం నుండి భారతదేశం జ్ఞాన సంప్రదాయంలో ఉన్నతమైనది. భారతదేశం ప్రపంచానికి దశాంశ వ్యవస్థను అందించిందన్నారు.