హనుమంతుడి సూత్రమే ఆదర్శంగా తీసుకొన్నాం : రాజ్నాథ్ సింగ్
అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఆపరేషన్ సిందూర్ తో మట్టుబెట్టామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో శత్రువుకు తగిన విధంగా బుద్ధి చెప్పామని అన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాజ్ నాథ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రైట్ టు రెస్పాండ్ హక్కును’’ వాడుకున్నాం అని ప్రకటించారు.మన అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టామని, సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత జాగరూకతతో ఈ దాడులు నిర్వహించామని చెప్పారు.
హనుమంతుని సూత్రాలనే తామూ అనుసరించామని, రావణ లంకలోని అశోక వాటికను నాశనం చేసే సమయంలో హనుమంతుడు అనుసరించిన సూత్రం ‘‘జిన్ మోహి మారా తీన్ మోహి మారే’’ అన్నట్లుగా అమాయకులను చంపిన వారినే తామూ చంపామని రాజ్ నాథ్ స్పష్టం చేశారు.మరోవైపు భారత సైనికులు అద్భుత పరాక్రమం ప్రదర్శించారని కొనియాడారు.పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకుని సాయుధ బలగాలు విజయవంతంగా ఈ ఆపరేషన్ నిర్వహించారని అభినందించారు.
భారత సైన్యం తన సత్తాను చాటిందని, అత్యంత కచ్చితత్వంతోనే దాడులు చేశామని తెలిపారు. పహల్గాంలో అమాయకుల ప్రాణాలు తీసిన వారు మూల్యం చెల్లించుకున్నారని, ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన విధంగా బుద్ధి చెప్పామని అన్నారు.హనుమంతుడినే తాము ఆదర్శంగా తీసుకున్నామని చెబుతూ అశోక్ వన కాండ ను ఉదహరించారు. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు ఎంతమాత్రమూ కాదని, ఉగ్రవాదుల స్థైర్యాన్ని దెబ్బతీశామని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తో రికార్డు సృష్టించామని, పాక్ పౌరుల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉగ్రవాదుల స్థావరాల్ని ధ్వంసం చేశామని తెలిపారు.