పీఓకే లేకుండా జమ్మూ కశ్మీర్ అసంపూర్ణం : రాజ్ నాథ్ సింగ్
పీఓకే లేకుండా జమ్మూ కశ్మీర్ అసంపూర్ణమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ కి పీవోకే విదేశీ భూభాగమే అవుతుంది తప్ప మరొకటి కాదన్నారు. అఖ్నూర్ సెక్టార్ సమీపంలోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్ వద్ద 9 వ సాయుధ దళాల వెటరన్స్ డే జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్లకు, అధికారులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పీఓకే పాకిస్తాన్ కి విదేశీ భూభాగమే అని, అందుకే అక్కడ ఉగ్రవాద వ్యాపారాన్ని చేస్తోందన్నారు. తాము ఢిల్లీని, జమ్మూ కశ్మీర్ ని ఒకే విధంగా చూస్తామని, అందుకు ఇదే నిదర్శనమని తెలిపారు. కశ్మీర్ పట్ల గత ప్రభుత్వాలు భిన్న వైఖరిని అనుసరించాయని, అందుకే వల్లే వారు ఢిల్లీకి దగ్గర కాలేదన్నారు. కశ్మీర్ కి, దేశంలోని మిగితా ప్రాంతాలకు ఓ వారధి నిర్మించడం తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం అని ప్రకటించారు. 1965 లో అఖ్నూర్ లో భారత్, పాక్ మధ్య యుద్ధం జరిగిందని, పాక్ సైన్యం ప్రయత్నాలను అడ్డుకోవడంలో భారత్ విజయం సాధించిందని గుర్తు చేశారు. పాకిస్తాన్ 1965 నుంచే అక్రమ చొరబాట్లను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు.