మథురలో సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ రెండు రోజుల పాటు మథురలోని పరఖమ్ లో జరగనున్నాయి. ఈ నెల 25,26 తేదీల్లో జరుగుతాయని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు. ఈ సమావేశాల్లో సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో పాటు ఆయా విభాగాల అఖిల భారతీయ బాధ్యులు పాల్గొంటారని తెలిపారు.
ఈ బైఠక్ లో విజయదశమి ఉత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అందించిన మార్గదర్శకత్వంపై సమగ్ర చర్చ, అలాగే అందులోని కీలక అంశాలు, దేశంలో జరుగుతున్న సమకాలీన అంశాలపై చర్చలు వుంటాయని తెలిపారు. అలాగే తదుపరి కార్యాచరణ, యోజన కూడా వుంటుందన్నారు. ఈ అంశాలతో పాటు మార్చి 2024 లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక ప్రణాళికపై సమీక్ష, సంఘ విస్తరణ, గణాంకాలు కూడా సమర్పించనున్నారు. మరీ ముఖ్యంగా 2025 విజయదశమి నాటికి సంఘ శతాబ్ది ఉత్సవాలకు నిర్దేశించుకున్న సంస్థాగత లక్ష్యాలను పూర్తి చేయడంపై కూడా ఈ సమావేశాల్లో చర్చలు జరుగుతాయని అంబేకర్ తెలిపారు.