ఆరెస్సెస్ కార్యకర్తలపై కత్తులతో దాడులు.. పది మందికి తీవ్ర గాయాలు
జైపూర్ లోని కర్ణి విహార్ ప్రాంతంలో ఆరెస్సెస్ స్వయంసేవకులపై కత్తులతో దాడి చేశారు. కోజాగిరి పూర్ణిమ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పది మంది స్వయంసేవకులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి దిగారు.దీంతో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కోజాగిరి పౌర్ణమి సందర్భంగా ప్రసాద వితరణ జరుగుతోంది. ఈ సమయంలోనే గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అక్కడి వచ్చారు. ప్రసాద కుండను కాలితో తన్ని, స్వయంసేవకులను దుర్భాషలాడారు. ఆ తర్వాత పది మందిపై కత్తులతో దాడికి దిగారు.
వీరిలో పలువురు పోలీసుల అదుపులోనే వున్నారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వయంసేవకులను పోలీసులు విచారిస్తూ, వివరాలు రాబడుతున్నారు. దుండగులు కత్తులతో స్వయంసేవకుల కడుపు, ఛాతీపై దాడి చేశారు. గాయపడిన వారిలో శంకర్ బాగ్రా, మురారీలాల, రామ్ పరీక్, లఖన్ సింగ్, జాదౌన్, పుష్పేంద్ర, దినేష్ శర్మ తదితరులు వున్నారు. పండగ వాతావరణాన్ని చెడగొట్టడానికే దుండుగులు ఇలా దాడికి దిగారని పోలీసులు పేర్కొంటున్నారు.
ఈ ఘటన తర్వాత హిందువులు భారీ సంఖ్యలో పోలీసు స్టేషన్ దగ్గర ధర్నాకి దిగారు. దుండగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వయంసేవకులపై కత్తులతో దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా హిందువులు ఢిల్లీ- అజ్మీర్ హైవేను కూడా దిగ్భంధించారు. అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో పోలీసులు నచ్చజెప్పడంతో, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.