గ్రామ గ్రామానికి ఆర్ఎస్ఎస్ శాఖలు : కాచం రమేష్

వ్యక్తి నిర్మాణం ద్వారా స్వయంసేవకులను రూపొందిస్తూ సమాజపరివర్తన ప్రధానంగా సంఘ్ కార్యం నడుస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తెలంగాణ ప్రాంత కార్యవాహ (కార్యదర్శి) కాచం రమేశ్ తెలిపారు. బెంగళూరులో మార్చి 21 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభల నేపథ్యంలో చేసిన తీర్మానాలు, సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి హైదరాబాదులో మీడియా ప్రతినిధులకు వివరించారు.
ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలకు చేరుకుంటున్న తరుణంలో సంఘ భావజాలం, సంఘ్ సిద్ధాంతాలను సమాజంలోకి మరింత వేగంగా తీసుకువెళ్లేందుకు, మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్న వేళ అఖిల భారత ప్రతినిధి సభలు జరిగాయన్నారు. 1925లో సంఘ్ ప్రారంభమైనప్పటి నుంచీ అనేక రకాల సమస్యలు, అవకాశాల నడుమ సంస్థ వృద్ధి చెందుతూ వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 51,570 స్థలాల్లో RSS దైనందిన శాఖలు 83,129 నడుస్తున్నాయని తెలియజేస్తూ గడచిన నాలుగైదేళ్లుగా శాఖలు, పాల్గొంటున్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతోందని, మరిన్ని శాఖలను ప్రారంభించాలని కోరుతున్నారని రమేశ్ తెలిపారు. గత సంవత్సరంతో పోల్చితే 10 వేలకు పైగా కొత్త శాఖలు ప్రారంభమయ్యాయన్నారు. వీటితో పాటు 32,147 శాఖా మిలన్లు (వీక్లీ), 12,091 నెలవారీ శాఖలు (మండలి) నడుస్తున్నాయని, మొత్తంగా దైనందిన శాఖలు, మిలన్లు, మండలితో కలిపి 1,27,367 శాఖాపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
తెలంగాణలో మొత్తం 1,839 స్థలాలలో 3,117 శాఖలు నడుస్తుండగా గతేడాదితో పోల్చితే 392 కొత్త శాఖలు ప్రారంభమయ్యాయని, వారంవారీ సాప్తాహిక్ మిలన్లు 382, నెలవారీగా 224 శాఖలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇవన్నీ కలిపి తెలంగాణలో 3,800 పైచిలుకు శాఖలు నడుస్తున్నాయని, వీటిలో ఎక్కువగా యువకులు, విద్యార్థులు ఉన్నారని తెలిపారు. సంఘ్‌ని గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించే లక్ష్యంతో ఐదారు గ్రామాలు ఒక ఉపమండలంగా దేశం మొత్తం మీద 58,900 పైచిలుకు గ్రామాలలో 30 వేలకు పైగా స్థలాలలో శాఖలు నడుస్తున్నాయన్నారు. ఇక తెలంగాణలో మొత్తం గ్రామీణ ఉపమండలాలు 1,602 కాగా, వీటిలోని 1,244 యూనిట్లలో అంటే సుమారు 70 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాలలో శాఖలు నడుస్తున్నట్లు తెలిపారు. అర్బన్ ఏరియాలలో ప్రతి 10 వేలమంది ఒక బస్తీగా (యూనిట్‌)సంఘ్ కార్యం జరుగుతోందని, తెలంగాణలో 1504 నగర బస్తీలుండగా వీటిలో 1150 బస్తీలలో ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయని, దీని ప్రకారం గ్రామాలలోను, నగరాలలోను ఆర్ఎస్ఎస్ పట్ల సమాన ఆదరణ లభిస్తోందని  రమేష్ చెప్పారు.
బ్లాక్ స్థాయిలో 3 రోజుల పాటు నిర్వహించిన శిక్షణకు 9,500 మందికి పైగా కార్యకర్తలు హాజరయ్యారని తెలిపారు. వీటితో పాటు నగరాలలోని స్లమ్స్‌లో సేవాబస్తీల పేరిట సంఘకార్య విస్తరణ ప్రయత్నం జరుగుతోందంటూ ఈ ఏడాది కొత్తగా 100 కొత్త సేవా బస్తీలలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ప్రారంభమై స్వయంసేవకుల ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు వివరించారు. సేవా బస్తీలకు సంబంధించి దేశవ్యాప్తంగా 90 వేలకు పైగా సేవాకార్యక్రమాలు జరుగుతుండగా, తెలంగాణలోని పలు సేవాబస్తీలలో శాఖల ద్వారా 980కి పైగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.ఇంకా, స్వయంసేవకుల ద్వారా బస్తీలు, గ్రామాలలో జరిగే పలు సామాజిక కార్యక్రమాలు, గ్రామవికాస కార్యక్రమం, సేవాకార్యక్రమాలు, శాఖలు జరిగే బస్తీలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టేందుకు నిర్వహించే సమావేశాల గురించి వివరించారు. ఈ విధంగా తెలంగాణలోని సుమారు 50 గ్రామాలలో పలు రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
ఇక బంగ్లాదేశ్‌లోని మైనార్టీలు, ప్రత్యేకించి హిందువులపై జరుగుతున్న మారణకాండను ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ అఖిలభారత ప్రతినిధి సభలో చేసిన తీర్మానం గురించి శ్రీరమేష్ మీడియాకి తెలియజేశారు. ఇస్లామిక్ జిహాదీలు హిందూ మహిళలపై చేసిన అత్యాచారాలు, హిందువుల ఆస్తుల లూటీ, గృహదహనాలు తదితర పరిణామాలను, ఈ హింసాకాండను నిరోధించేందుకు అంతర్జాతీయ సమాజం తీసుకోవలసిన చర్యల గురించి ప్రస్తావించారు.
ఇక సంఘ్ ప్రారంభించి 100 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది విజయదశమితో ప్రారంభించి 2026వ సంవత్సరం విజయదశమి మధ్య ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో సామాజిక కార్యక్రమాలు, సమాజ పరివర్తనా కార్యక్రమాలలో స్వయంసేవకుల భాగస్వామ్యానికి సంబంధించిన సంకల్ప పత్రంపై చర్చలు జరిగాయన్నారు.అదే సమయంలో పోర్చుగీసువారిపై పోరాడిన భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు రాణి అబ్బక్క 500వ జయంతిని సందర్భంగా ఆర్ఎస్ఎస్ సర్‌కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హొసబాళె గారు విడుదల చేసిన ప్రకటన, గత ఏడాది రాణి అహల్యా బాయి 300వ జయంతి సందర్భంగా నిర్వహించిన సామాజిక సమరసత కార్యక్రమంలో భాగంగా క్యాలెండర్ల వితరణ గురించి వివరించారు.
గతేడాది తెలంగాణ ప్రాంతంలో జరిగిన విజయదశమి వేడుకల్లో సుమారు 50 వేలమందికి పైగా స్వయం సేవకులు పాల్గొని 161 స్థలాల్లో రూట్ మార్చ్ నిర్వహించారని, ఇందులో 28 వేలకు పైగా స్వయంసేవకులు సంఘ్ యూనిఫాం వేసుకుని పాల్గొన్నారని తెలిపారు. ఇందులో ఎందరో కొత్తవారు ఉన్నారన్నారు. వచ్చే విజయదశమి రోజున ప్రతి ఆర్ఎస్ఎస్ శాఖ గణవేష్ (యూనిఫాం)లో ఉత్సవం చేస్తుందని, ఇందులో భాగంగానే పథసంచలన్, శోభాయాత్రలు, ఘోష్ (సంగీత వాయిద్యాలతో) కూడా యూనిఫాంలో జరుగుతాయి తెలిపారు. నూరేళ్ళ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సంఘ్ ఆలోచనలు, భావాలను సమాజం వద్దకు తీసుకెళ్లేలా వచ్చే నవంబర్-డిసెంబర్-జనవరి నెలల్లో దేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లడానికి జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
సమాజ పరివర్తనకు సంబంధించిన అంశాలను అందిస్తామన్నారు. ఇదే కార్యక్రమాన్ని తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయితీలోను, ప్రతి బస్తీలోనూ, ప్రతి మూల మూలనా అందరినీ కలుపుకుని వెళ్లేలా కరపత్రం, పుస్తకం పంపిణీ ద్వారా నిర్వహిస్తామన్నారు. ఇంకా అనేక బస్తీలు, ఉపమండలాలు, బ్లాక్ స్థాయిలోను, నగరాలలో ప్రతి లక్షమంది ఒక యూనిట్‌గా హిందూ సమాజ ఉత్సవాలు చేస్తామని, ఇందులో స్థానిక నేతలు, హిందూ సంస్థలకు భాగస్వామ్యం కల్పించి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు.మనమంతా ఒక్కటేననే ఏకాత్మ భావనను, సమరసతను ప్రేరేపించేలా ప్రతి బ్లాక్‌లోను వివిధ సంస్థలు, మఠాలు, కులాల ప్రముఖ వ్యక్తుల భాగస్వామ్యంతో సామాజిక సద్భావన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
ఇంకా, పర్యావరణ హితం, స్వదేశీ జీవన విధానాన్ని పాటించడం, సామాజిక అనుశాసనం, చట్టాలను పాటించడం, హిందూ కుటుంబాలను కాపాడటం వంటి అంశాలను తీసుకుని సామాజిక సద్భావన సదస్సులు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. అదే క్రమంలో జిల్లా కేంద్రాలు, నగర కేంద్రాలలో ప్రతిష్ఠిత వ్యక్తులు, యువకులతో సదస్సులు నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో గ్రామగ్రామానికి శాఖను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు ముందే తెలంగాణలో ప్రతి ఉపమండలం, బస్తీలో అన్నింటా కలిపి శాఖల సంఖ్యను 4 వేలకు చేర్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.
వ్యక్తి నిర్మాణం ద్వారా స్వయంసేవకులను రూపొందిస్తూ సమాజపరివర్తన ప్రధానంగా సంఘ్ కార్యం ఉంటూ వస్తోందని  కాచం రమేష్ తెలియజేస్తూ ఈ సమైక్యతా కార్యం గురించి మీ మీడియా ద్వారా సమాజానికి తెలియజేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *