దక్షిణాది అమర్ నాథ్ యాత్ర ‘‘సలేశ్వర యాత్ర’’… నల్లమల్ల అడవుల్లో భక్తి పారవశ్యం
సలేశ్వరం లింగమయ్య జాతర వేడుకలు ముగిశాయి. సలేశ్వరం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. సలేశ్వరం జాతర సందర్భంగా భక్తులు ఇబ్బందులు నడుమనే లింగమయ్యను దర్శించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం రాంపూర్ పెంట సమీపంలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యం పరిధిలోని నల్లమల్ల కొండల్లో ఆలయం ఉంది. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించే సలేశ్వరం లింగమయ్య జాతర ముగింపు వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 11 నుంచి 13 వరకు జాతర నిర్వహించారు. అభయారణ్యం పరిధిలో ఆలయం ఉండడంతో అటవీశాఖ అనుమతులతో జాతర నిర్వహించారు.
దక్షిణాది అమరనాథ్ యాత్రగా సలేశ్వరం పేరు గాంచింది. ఏటా చైత్ర పూర్ణిమి నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలివస్తుంటారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో నల్లమల్ల (Nallamalla) అడవుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక అటవీ అధికారులు, చెంచు సంఘాల నాయకులు అడవి మార్గంలో, ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు.
ఇక నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని దట్టమైన అడవిలో జరిగే ఈ సలేశ్వరం జాతరకు వెళ్లాలంటే గుట్టలు, లోయల్లో సాహస యాత్ర చేయాల్సిందే. ఎత్తయిన కొండలు.. దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజసిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ.. 4 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి లింగమయ్యను దర్శించుకోవాలి.నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో సలేశ్వర క్షేత్రం ఉంటుంది. శ్రీశైలం – హైదరాబాద్ రహదారి గుండా ఇక్కడికి చేరుకోవచ్చు. ప్రధాన రహదారి నుంచి 30 కి.మీకుపైగా లోపలకి వెళ్లాలి. ఆ తర్వాత… 4 నుంచి 5 కి.మీ వరకు నడవాల్సి ఉంటుంది.
సళేశ్వరం క్షేత్రంలోని లింగమయ్యను దర్శించుకునేందుకు భారీ లోయలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతమాతం రాళ్లు, రప్పలు ఉంటాయి. కర్రల సాయంతోనే నడవాల్సి ఉంటుంది. ఇదే ప్రాంతంలో నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనిపిస్తుంది. సళేశ్వరుడి కొలువుదీరిన ప్రాంతంలో…. పైనుంచి నీటి దార ప్రవహిస్తూ ఉంటుంది. చాలా ఎత్తైన ప్రాంతం నుంచి ఈ జలాలు వస్తాయి. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి సళేశ్వరుడిని దర్శించుకుంటారు.
ఇక్కడికి వచ్చే భక్తులు లోయలోకి వెళ్లేటప్పుడు… ‘వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్యో’ అంటూ వెళ్తారు. ఇక దర్శనం పూర్తి అయిన తర్వాత… బయటికి వచ్చేటప్పుడు ‘పోతున్నాం.. పోతున్నం లింగమయ్యో’ అంటూ నినాదాలు చేస్తుంటారు. సలేశ్వరం లోయ దాదాపు రెండు కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ప్రకృతిలో గడపాలని అనుకునే వారికి ఈ ప్రదేశం చాలా నచ్చుతుంది. సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాలు దాటుకుంటూ వెళ్లాలి.
పురాతన కాలం నుంచి ఆలయంలో చెంచు పెద్ద మనుషులే పూజరులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ మాత్రమే కాకుండా సరిహద్దు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.ఈ గుడి దగ్గర సర్వేశ తీర్థం, పుష్కర తీర్థం అని రెండు తీర్థాలుంటాయి. గుడికి ఎదురుగా జలపాతం వుంటుంది. 200 మీటర్ల ఎత్తున్న కొండ మీద నుంచి నీళ్లు కిందకు దుంకుతాయి. భక్తులు ఇక్కడ స్నానాలు చేసి శివుడ్ని దర్శించుకుంటారు. ఈ జాతర చూసేందుకు చాలా మంది తరలివస్తారు.