ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి : భవిష్యవాణిలో స్వర్ణలత
ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి (రంగం) వినిపించారు. పంటలు బాగా పండుతాయని, కోరినన్ని వర్షాలు కురుస్తాయని తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. వడి బియ్యం, చీర సారెలతో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ‘నాకు సంతోషంగా ఉంది. నాకు కావాల్సిన పూజలన్నీ అందిస్తున్నారు. బాలికలు, యువతులు, మహిళలు ఇలా ఎవరు బోనం సమర్పించినా స్వీకరిస్తా. పంటలు బాగా పండుతాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అన్నారు.
కోరినన్ని వర్షాలు కురుస్తున్నాయని, తనను చూడాలంటే 48 గంటలు కష్టం అంటున్నారని, ఆమాత్రం కష్టపడలేరా? అని ప్రశ్నించారు. . ఏమి తెచ్చినా ఆనందంగా తీసుకుంటానని అన్నారు. ఇక ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతానని తెలిపారు. ప్రజలను చల్లగా కాపాడుకుంటానని, ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని అంటూ స్వర్ణలత భవిష్యవాణిలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.