ట్రిబ్యూనల్ చెప్పిందే వక్ఫ్ ఆస్తి.. కోర్టులకు అధికారం లేదు

ఏది వక్ఫ్ ప్రాపర్టీ, ఏది కాదో ఎవరు గుర్తించలేకపోతున్నారని,  చివరకు వక్ఫ్ ట్రిబ్యునల్ చెప్పిందే ఫైనల్ అయిపోతుందని హిందూవాహిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ్ బి రాజవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకొస్తుందని తెలిపారు.
వక్ఫ్ బోర్డ్, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంశంపై రిథమ్ డిజిటల్ మీడియా ఫౌండేషన్ నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ  హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉండగా ముస్లిం, క్రిస్టియన్స్ కు సంబంధించిన భూములన్నీ ఆయా మత సంస్థల చేతుల్లో సురక్షితంగా ఉన్నాయని చెప్పారు.
హిందూ ఆలయాల భూములన్నీ భక్తులు లేదా పూర్వపు రాజవంశీకులు ఇచ్చినవి కాగా, వాటిని ఆ దేవాలయాల నిర్వహణకు, హిందూవుల ధార్మిక అవసరాల కోసం ఉపయోగించకుండా ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. కానీ ముస్లిం, క్రైస్తవ ఆస్తులు చాలావరకు ప్రభుత్వపు భూములే అని తెలిపారు.
వివిధ చట్టాల క్రింద ప్రభుత్వ నిర్వహణలో ఉండవలసిన భూములను ప్రభుత్వాల నిర్లక్ష్యం లేదా వోట్ బ్యాంకు రాజకీయాల కారణంగా వక్ఫ్ స్వాధీనంలో ఉంటున్నాయని, వ్యక్తుల భూములను సహితం ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తరువుల పేరుతో వక్ఫ్ స్వాధీనం అవుతున్నాయని ఆయన వివరించారు. ఇటువంటి భూముల విషయంలో కోర్టులు సహితం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట ఆవరణ ద్వారా ప్రచారం జరుగుతున్నట్లు వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరగదని ఆయన స్పష్టం చేశారు. అయితే వారి ఆధీనంలో ఉన్న వివాదాస్పద భూములకు సంబంధించిన ఆధారాలు వారు చూపాల్సి వస్తుందని, వివాదం పరిష్కారం కానీ పక్షంలో పరిష్కారం కోసం కోర్టులను ఆశ్రయించే సౌలభ్యం ఏర్పడుతుందని ఆయన వివరించారు.
మరో ముఖ్య అతిథి తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది విశ్వప్రసాద్ మాట్లాడుతూ దేశాన్ని అన్ని విధాల విడగొట్టేందుకు ఒక కుట్ర పూరితంగా ప్రయత్నాలు జరిగాయని వివరించారు. దేశ విభజన అనంతరం అసలు ముస్లింలకు భారత్ లో ఎలాంటి ఆస్తులు లేవని, అలాంటప్పుడు వాటిని కాపాడేందుకు ఒక చట్టం ఎలా తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు.
దేవాలయాల ఆస్తులన్నీ ఒకప్పుడు వాటిని కాపాడే వారి దగ్గర ఉండేవని,  కానీ ప్రస్తుతం వాటిపై ప్రభుత్వ పెత్తనం ఉందని తెలిపారు. కానీ ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ముస్లిం, క్రిస్టియన్ ఆస్తులు ఇవాళ ఆయా కమ్యూనిటీ లకే అప్పచెప్పారని వివరించారు. జర్నలిస్ట్ నవతా కార్యక్రమం నిర్వహించగా, రిథమ్ ఎడిటర్ రామా విశ్వనాధ్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్ నర్స్ గా‌  మై ఇండ్ మీడియా, ఆర్ వాయిస్, జాగృతి టీవీలు వ్యవహరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *