‘మతమార్పిళ్లు ఆపాలి’- సోయం బాపూరావు
మతం మారిన గిరిజనులందరూ తిరిగి హిందూ మతంలోకి రావాలని, వారిని సాదరంగా హిందూమతంలోకి తిరిగి ఆహ్వనిస్తున్నామని అదిలాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు సోయం బాపూరావు పిలుపునిచ్చారు. మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ తెలంగాణ జనజాతి సురక్షా మంచ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని స్థానిక రామ్లీలా మైదానంలో గిరిజన సంస్కృతి పరిరక్షణ సమ్మేళనం పేరుతో మే 28న ‘డి-లిస్టింగ్’ కోరుతూ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని తెలంగాణ జిల్లాల నుంచి ఆదివాసీలు హాజరయ్యారు.
ఈ సభలో మాట్లాడిన ఎంపీ, మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి తొలగించాలని కోరారు. ఆదివాసీ గూడెల్లో క్రైస్తవ మత ప్రచారకులు గిరిజినులను ప్రలోభాలకు గురిచేసి, మతం మార్చేస్తున్నారని మండిపడ్డారు. అనారోగ్యానికి గురైన గిరిజనులకు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చి, ఏసుప్రభువు వల్లే ఆరోగ్యం నయమైందని మభ్య పెడుతున్నారని అన్నారు. పాస్లర్లు పెద్ద ఎత్తున బలవంతపు మాత మార్పిళ్లకు పాల్పడుతున్నారని, ఇలా ప్రలోభాలకు గురిచేసే వ్యక్తులు ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని, తీవ్రంగా హెచ్చరించారు.