జైశ్రీరాం అంటే ఏమైనా క్రిమినల్ చర్యా? సుప్రీం ప్రశ్న
జైశ్రీరాం అని నినదించడం ఏమైనా క్రిమినల్ చర్యా? అంటూ సుప్రీం కోర్టు సూటిగా ప్రశ్నించింది.ఏదైనా మతానికి చెందిన పేరునుగానీ, నినాదాన్నిగానీ ఎలుగెత్తి చెప్పడం తప్పు ఎలా అవుతుందని వ్యాఖ్యానించింది. మసీదు లోపల జై శ్రీరాం అన్న నినాదాలు చేశారంటూ ఇద్దరు వ్యక్తులపై కర్ణాటకలో కేసు నమోదయింది. ఆ కేసును అక్కడి హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ పిటిషనర్ హైదర్ ఆలీ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ అప్పీలుపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ‘‘జై శ్రీరాం అన్న నినాదం చేయడం నేరమవుతుందా? ఆ ఇద్దరు వ్యక్తులే ఈ నినాదం చేసినట్టు ఎలా గుర్తించారు? అని సుప్రీం ప్రశ్నించింది.
అలాగే సీసీటీవీ కెమేరాలు ఉన్నాయని చెబుతున్నా వారిని గుర్తించింది ఎవరు? అని అడిగింది. అయితే మరొకరి మతపరమైన ప్రాంతంలో మతానికి సంబంధించిన నినాదం ఇవ్వడం, విద్వేషాలను రెచ్చగొట్టడం కిందికే వస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. నిందితులను గుర్తించారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి కర్నాటక పోలీసులే సమాధానం చెప్పాలని న్యాయవాది అన్నారు. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. 2023 సెప్టెంబరు 24న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మసీదులో చొరబడి జైశ్రీరాం నినాదాలు చేయడంతో పాటు బెదిరించారంటూ కేసు నమోదైంది.