టంగుటూరి నిర్భీతి
నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానం రజాకార్ల అరాచకాలతో అట్టుడుకుతున్న 1948 నాటి రోజులవి. ఆ సమయంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు సిద్ధం కాగా, వద్దని నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వారించినా ఆయన వినలేదు. రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీని కలుసుకుని పెడధోరణులు ఆపకుంటే ప్రమాదంలో పడతావని నేరుగా హెచ్చరించిన ధీశాలి ప్రకాశం పంతులు. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వరని నెహ్రూని నిలదీసిన పోరాట యోధుడు. స్వరాజ్య పత్రికను నిలిపివేయాలనే గాంధీజీ సూచనను నిరాకరించిన నిర్భీతి ఆయన సొంతం. అందుకే కాబోలు, ఓ సందర్భంలో ప్రకాశం పంతులుగారిని ఉద్దేశిస్తూ, ‘‘అవసరమైతే గాలితో సైతం పోట్లాడే స్వభావం కలవారని’’, అయ్యదేవర కాళేశ్వరరావు అన్నారు. ఐక్య చర్య ద్వారా మాత్రమే స్వేచ్ఛను సాధించగలమని దృఢంగా విశ్వసించిన మన పంతలుగారు, ఇందుకోసం గాంధీజీని సైతం వ్యతిరేకించడానికి వెనుకాడలేదు.