పర్యాటకులపై ఇస్లామిక్ ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి, తొమ్మిది మందికి గాయాలు
జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పట్టపగలే ఆరుగురు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఒకరు మృతి చెందగా.. తొమ్మిది మంది పర్యాటకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ సమయంలో పర్యాటకులు గుర్రపు స్వారీ చేస్తున్నారు. ఈ కాల్పుల్లో పలు గుర్రాలకు కూడా గాయాలయ్యాయి. ముసుగులు ధరించి, నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ ప్రాంతం సున్నితమైన ప్రాంతం కావడంతో ఘటనా స్థలికి చేరుకోవడానికి భద్రతా బలగాలకు కూడా కొంత సమయం పట్టింది. చివరికి సంఘటనా స్థలికి చేరుకున్న భద్రతా బలగాలు… ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఒక్కసారిగా ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పర్యాటకులు షాక్ లో వుండిపోయారు. దాదాపు 3 నుంచి 5 నిమిషాల వరకు ఉగ్రవాదులు ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
పహల్గామ్ అనేది అద్భుతమైన పర్యాటక ప్రదేశం. చుట్టూ అడవులు, సరస్సులు వుంటాయి. పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే. ఇస్లామిక్ ఉగ్రవాదులు ముందస్తు ప్రణాళికతోనే ఈ దాడికి దిగినట్లు భద్రతా బలగాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.మరోవైపు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించింది. పర్యాటకం ద్వారా జమ్మూ కశ్మీర్ కి ఆదాయం వస్తుంది. పర్యాటకులపై దాడి జరగడం దురదృష్టకరం. ఈ రకమైన దాడులతో పర్యాటకులు వెనక్కి మళ్లే అవకాశాలున్నాయి’’ అని జమ్మూ కశ్మీర్ ఆరోగ్య మంత్రి సఖినా మసూద్ అన్నారు.
మరోవైపు ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ కూడా స్పందించింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రవీందర్ రైనా అన్నారు. ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఈ దాడికి పాల్పడింది పిరికిపందలైన పాకిస్తానీ ఉగ్రవాదులు అని అన్నారు. భద్రతా దళాలను ఎదుర్కోవాల్సింది పోయి, అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని, దాడికి దిగారని మండిపడ్డారు.