ఉగ్రవాదులను విడిచిపెట్టం : ఉగ్రదాడిపై ప్రధాని మోదీ
జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. గాయపడిన వారికి సాధ్యమైనంత ఎక్కువగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ దారుణమైన చర్యకు ఒడిగట్టిన వారిని చట్టం ముందు నిలబెడతామని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ తేల్చి చెప్పారు. వారి దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని, ఉగ్రవాదంపై పోరాడాలన్న తమ సంకల్పం దృఢమైందని, అది మరింత బలపడుతుందని ఎక్స్ మాధ్యమంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం సౌదీ పర్యటనలో వున్నారు. ఈ దాడి జరగ్గానే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి ఫోన్ చేశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సంఘటనా స్థలికి వెళ్లి, పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.