ఇకఫై షాపింగ్ షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో గిరిజన ఉత్పత్తుల విక్రయం
గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ని బలోపేతం చేయనుంది. గిరిజనులు తయారు చేస్తున్న వస్తువులను అన్ని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో లభ్యమయ్యేలా గిరిజన శాఖ కసరత్తు ప్రారంభించింది. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాలలో కూడా గిరిజన ఉత్పత్తుల ఔట్లేట్లు వుంచాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే అంటే.. రైతు బజార్లు, స్టాల్స్లో దొరకుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే దొరుకుతున్నాయి. ఇప్పుడు సిటీల్లో కూడా దొరికేలా యత్నాలు చేస్తున్నారు. అన్ని సూపర్ మార్కెట్లలో కూడా లభ్యమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అన్ని సూపర్ మార్కెట్లలో కూడా గిరిజన ఉత్పత్తులు అమ్మేలా ఆయా యాజమాన్యాలతో కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తేనె, షాంపూలు, సబ్బులనే ప్రధానంగా విక్రయిస్తున్నారు. అలాగే అలోవెరా షాంపులు, కుంకుడు గాయలు, గిరిజన హానీ పేరుతో తేనెను విక్రయిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా అడవుల్లో నుంచి గిరిజనులు ముడిసరుకు తీసుకొచ్చి ఆ ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. అయితే.. గిరిజన ఉత్పత్తులు వాడాలని చాలా మంది ఇప్పటికీ భావిస్తుంటారు. కానీ… వారికి సౌలభ్యంగా లేవు. ఇప్పుడు అందరికీ గిరిజన ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రసాయనిక ఉత్పత్తులు తగ్గి, కలుషితం లేని పదార్థాలే సమాజంలోకి వస్తాయి. అంతేకాకుండా గిరిజనులకు ఆర్థికంగా కూడా బాగా పరిపుష్టం చేసినట్లు అవుతుంది.