జైనూర్ ఘటన నిందితుడికి ఉరి శిక్ష వేయాలి : వనవాసీల డిమాండ్
వనవాసీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని వనవాసీలు డిమాండ్ చేశారు. జైనూర్ లో అమాయక మహిళపై అత్యాచారయత్నం చేసి, హత్యకు ప్రయత్నం చేసిన నిందితుడికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. జైనూర్ ఉదంతాన్నివ్యతిరేకిస్తూ, నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ వనవాసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్ కి పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఈ బంద్ విశేష ప్రభావం చూపించింది. ఆదిలాబాద్ బస్టాండ్ ముందు ఉదయం నాలుగు గంటల నుంచే వనవాసీలు ధర్నా చేపట్టారు. దీంతో బస్సులన్నీ డిపోకే పరిమితమైపోయాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను మూసేశారు. ఏజెన్సీ చట్టాలను ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే ఈ చట్టాన్ని అమలు చేస్తూ వనవాసీలు కానివారిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు.