సమైక్య శక్తి రాజ్యాంగ స్ఫూర్తి
దేశ ప్రజలందరనీ ఒక్కటిగా చేయడమే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ కుమార్ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఎస్సీ, ఎస్టీ హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26న ఘనంగా జరిగింది. సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యాం ప్రసాద్ వ్రాసిన ‘మనమూ మన భారతరాజ్యాంగము ప్రత్యేకతలు’ అనే పుస్తకాన్ని ఈ సందర్బంగా ఆవిష్కరించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్.ఎస్.ఎస్ జాతీయ కార్యకారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ మాట్లాడుతూ సృష్టిలోనే భగవంతుడు వైవిధ్యాన్ని అందించి, దానిలో ఏకాత్మతను దర్శింపజేసాడని, భారతీయ ఋషులు ఈ ఏకాత్మతను దర్శించి, సర్వ మానవాళికి అందించారని అన్నారు. ఈ భూమిపై వెలసిన భారతీయ సంస్కృతిని అసమా నతలు, భేద భావాలు, ఘర్షణలు లేని శాంతి, సమరస భావాలు విలసిల్లే విధానంగా తీర్చిదిద్దా రని, ఆ విలువల ఆధారంగా మన భారత రాజ్యాంగం రూపొందించబడిందని పేర్కొన్నారు.
ముస్లింలు, క్రైస్తవులు, బౌద్దులు, సిక్కులు, ఇలా ఈ దేశంలో నివసించే అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని భాషలకు చెందిన వారి రక్తంలో ఒకే డిఎన్ఏ ఉందని ఎప్పుడో తేల్చి చెప్పారని గుర్తుచేశారు. పరస్పరం కలహించుకోవటం వల్ల భారత దేశానికి నష్టం వాటిల్లుతుందని, రాజ్యాంగం చెప్పిన విధంగా చట్టం ముందు అందరూ సమానులే అను పద్దతిలో జీవించాల న్నారు.
రాజ్యాంగం సమర్పించిన ప్రారంభ దినాల్లో 370 ఆర్టికల్ను రాజ్యాంగంలో పొందు పరచటాన్ని డా అంబేద్కర్తో పాటు నల్గురు ముస్లిం రాజ్యాంగ సభ్యులు గట్టిగా వ్యతిరేకించి సభను బహిష్క రించారని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలందరూ భారతీయులుగా గర్వించి, కలలు కని ప్రశాంతంగా జీవిస్తూ, సుందర భారత దేశాన్ని నిర్మించుకోవాలని ఆయన ఉద్బోధించారు. హిందువులలో మాదిరిగా క్రైస్తవ, ముస్లింలలో కూడా వందలాది తెగలు ఉన్నాయని, అయిన ప్పటికీ మనమంతా హిందూస్తానీయులమని, ‘ఆవాజ్ దో హమ్ ఏక్ హై’ అనే ఆలోచనతో ముందుకు నడవాలని అన్నారు.
అనంతరం సామాజిక సమరసతా వేదిక జాతీయ కన్వీనర్ శ్రీ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగం గురించి సంక్షిప్తంగా నేటి తరానికి తెలపాలన్న సదాశయంతోనే ఈ పుస్తక రచన జరిగిందని తెలిపారు. శ్రీలంక, పాకిస్తాన్, బర్మాలలో కూడా రాజ్యాంగం అమలులో వున్నప్పటికి సైనికుల చెప్పు చేతల్లో ఆ దేశాలు నడుస్తున్నాయని, కానీ మన దేశంలో మాత్రం ప్రజలందరి శ్రద్ధా విశ్వాసాల వల్ల, ప్రజాస్వామ్యం చక్కగా పరిఢవిల్లుతుందని, రాజ్యాంగం లో పేర్కొన్న విధంగా పేదలు, నిర్భ్యాగ్యులు, అలాగే సామాజిక వివక్షత కు గురవుతున్న నిమ్న వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం హామీ ఇచ్చిందని, ఆ ఫలితాలు వారికి చేరవేయడానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా రవి, ఉర్దూ యునివర్సిటీ రిజిస్ట్రార్ ఇఫ్తీయాక్ అహ్మద్, మైనార్టీ మోర్చా ఆంధప్రదేశ్ నాయకులు మస్తాన్ పాల్గొన్నారు.