సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఆదివారం ఓ కూరగాయల మార్కెట్
సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, బాగా ప్రచారంలోకి తేవాలని ఓ పాఠశాల పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. ఇది జరిగింది విశాఖపట్నంలో. వసంత బాల విద్యోదయ పాఠశాల పూర్వ విద్యార్థులు థియోసాఫిల్ సొసైటీ సభ్యుల సాకారంతో సేంద్రీయ వ్యవసాయ మార్కెట్ నే తెచ్చారు. సేంద్రీయ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం, సేంద్రీయ ఎరువులను ఉపయోగించి పంటలు పండించే రైతులకు మద్దతివ్వడమే లక్ష్యంగా ఈ మార్కెట్ తయారైంది.
ప్రతి ఆదివారం సీతమ్మధారలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్ లోని పాఠశాల ప్రాంగణం సేంద్రీయ మార్కెట్ గా మారిపోతుంది. ఉత్తర కోస్తా, ఆంధ్ర, గోదావరి జిల్లాల నుంచి రైతులు తమ సేంద్రీయ ఉత్పత్తులను అమ్మకానికి ఇక్కడికి తీసుకొస్తారు. ఈ మార్కెట్ లో సేంద్రీయ ఉత్పత్తులకి సంబంధించిన బహుళ స్టాల్స్ అందుబాటులో వుంటాయి. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలతో పాటు సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి, ఉత్పత్తి అయ్యే నువ్వుల నూనె కూడా అందుబాటులో వుంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు వుంటుంది.
స్థానికులు ఈ చొరవను ప్రశంసిస్తున్నారు. తాము తమ టెర్రస్ లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించామని, ఆకు కూరలు, కొన్ని కూరగాయలను పెంచుతున్నామని, వాటిని కూడా ఈ మార్కెట్ లో అమ్మకానికి తీసుకొచ్చామన్నారు. దీంతో తమకి మార్కెట్ అవుతోందన్నారు.
మరోవైపు కొన్ని సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలు అందుబాటులో లేవు. అందుకే వాటిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF) మరియు రైతు సాధికార సంస్థ (RYSS)తో సంబంధం ఉన్న రైతుల నుండి సేకరిస్తున్నారు.
మరోవైపు ప్రజల్లో కూడా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులపై బాగా అవగాహన పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కూడా పెరుగుతోందన్నారు. రసాయన ఎరువులతో పండించిన ఉత్పత్తులతో పోలిస్తే.. సేంద్రీయ ఎరువులతో పండించిన ఉత్పత్తులనే తీసుకుంటున్నారన్నారు. దీంతో తమ ఆరోగ్యాలు బాగుంటాయని నమ్ముతున్నారన్నారు.
సేంద్రీయ ఉత్పత్తుల మార్కెట్ ను విస్తరించడం, సేంద్రీయ వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు వివరించారు. ప్రతి ఇంటికీ ఓ కుటుంబ వైద్యుడు వున్నట్లే.. ప్రతి కుటుంబంలో ఓ సేంద్రీయ రైతు వుండేలా ప్లాన్ చేయాలన్నారు. దీని ద్వారా ఆరోగ్యకరమైన, రసాయన రహిత ఉత్పత్తులను పొందే అవకాశాలున్నాయన్నారు.