భద్రతా మండలిలో పాక్ కి కఠిన ప్రశ్నలు.. బిత్తరపోయి, ఇరుక్కున్న పాక్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ కి చుక్కెదురైంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఓ క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఐరాస భద్రతా మండలి పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే పాకిస్తాన్ తప్పును ఎత్తిచూపే పలు ప్రశ్నలను కూడా వేసింది. దీంతో పాకిస్తాన్ ఇరుకునపడిపోయింది. అయితే..పహల్గాం ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. దీంతో పాకిస్తాన్ ఒంటరైంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ క్షిపణి ప్రయోగాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అణ్వాయుధాల విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేసింది. దీనిపైనే భద్రతా మండలి తీవ్రంగా విరుచుకుపడింది. పలు దేశాల ప్రతినిధులు కూడా పాకిస్తాన్ వైఖరి, రెచ్చగొట్టే విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే హిందువులే టార్గెట్ గా పర్యాటకులను పహల్గాంలో కాల్చి చంపడంపై కూడా భద్రతా మండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
మరీ ముఖ్యంగా ఐరాస భద్రతా మండలి సభ్యులు పహల్గాం ఉగ్రదాడిని ఈ సమావేశంలో లేవనెత్తారు. ఈ దాడి వెనుక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయ్యబా పాత్రపై కూడా ఆరా తీశారు.ఇదే విషయాన్ని నేరుగా పాకిస్తాన్ ను అడిగారు. అలాగే భారత్ పై తప్పుడు కథనాలను సృష్టిస్తున్న పాక్ పై సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలాగే ద్వైపాక్షికంగా సమస్యలను పరిష్కరించుకోవాలని భద్రతా మండలి పాకిస్తాన్ కి సూచించింది.