ఆరెస్సెస్ కార్యక్రమాల్లో ప్రభుత్వోద్యోగులు పాల్గొనవచ్చు: ఉత్తరాఖండ్ ప్రభుత్వం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై భేషుగ్గా పాల్గొనవచ్చని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం శాఖ, సాయంత్రం శాఖ, ఇతర సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో రాష్ట్ర ఉద్యోగులు పాల్గొనడం ఉత్తరాఖండ్ రాష్ట్ర ఉద్యోగుల ప్రవర్తనా నియమాలు 2002 ఉల్లఘణనగా పరిగణించమని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ఉద్యోగులు తమ అధికారిక విధులు, బాధ్యతలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా… పనిచేస్తూ, ఆరెస్సెస్ కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొనవచ్చని రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ఆనంద వర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు.కార్యాలయ సమయానికి ముందు లేదా తర్వాత మాత్రమే ఆరెస్సెస్ కార్యక్రమాల్లో పాల్గొనచ్చని ప్రభుత్వం పేర్కొంది. గతంలో పేర్కొన్న ఉత్తర్వుల స్థానంలో ఈ నూతన ఉత్తర్వులు అమలులో వుంటాయని ప్రభుత్వం తెలిపింది.