వనజీవి రామయ్య వెళ్లిపోయారు… మొక్కలే ప్రాణంగా బతికిన ధన్యజీవి
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్య (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా రామయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇవాళ (శనివారం) తెల్లవారుజామున ఇంట్లో స్పృహ లేకుండా ఉంటే దగ్గరలోని ఆర్ఎంపీకి చూయించి ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగానే రామయ్య చనిపోయారు. కోటి మొక్కలకు పైగా వనజీవి రామయ్య, జానకమ్మ దంపతులు నాటారు. కోటికి పైగా మొక్కలను నాటి వనజీవి రామయ్య చరిత్ర సృష్టించారు. . మొక్కలను పెంచాలని చిన్నతనం నుంచే ప్రచారం చేశారు. మొక్కలు నాటుతూ దరిపల్లి రామయ్య (వనజీవి రామయ్య) సేవ చేశారు. వనజీవి రామయ్యకు నలుగురు పిల్లలు.. వారిలో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వనజీవి రామయ్య భార్య పేరు జానకమ్మ.
ఆయన అసలు పేరు దరిపల్లి రామయ్య. కానీ… ప్రపంచం మొత్తానికీ వనజీవి రామయ్యగానే గుర్తింపు పొందారు. పర్యావరణ వేత్తగా, సామాజిక కార్యకర్తగా జీవితాంతం మొక్కలు నాటడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. కేవలం నాటడమే కాకుండా సంరక్షించడం కూడా చేసేవారు. ఖాళీ భూములు, రోడ్ల పక్కన, ప్రభుత్వ ప్రైవేట్ స్థలాల్లో కోటికి పైగా మొక్కలు నాటి, చరిత్ర నెలకొల్పారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయనకున్న నిబద్ధతను కేంద్ర ప్రభుత్వం గుర్తించి, 2017 లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు. అంతేకాకుండా ఆయన జీవిత గాథను పర్యావరణ పరిరక్షణ సందేశంగా పాఠ్యాంశాల్లోనూ చేర్చారు.
వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండేవారు. ఇలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు వనజీవి. మూడు కోట్ల మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యమని వనజీవి రామయ్య చెప్తుండేవారు. తెలంగాణ ప్రభుత్వం ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి గురించి పాఠ్యాంశంగా చేర్చింది.
అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నది.రామయ్య ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే. నాలుగు దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా యాన చెట్ల పేర్లే పెట్టారు. ఒకామె పేరు చందనపుష్ప, ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కుబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు.
కోటికిపైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005లో సెంటర్ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి మనమిత్ర అవార్డులో ఇచ్చింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు లభించింది.
నిజానికి వనజీవి ప్రస్థానం ఒంటరిగానే ప్రారంభమైంది. చేతిలో సంచి, మాసిన పంచె, తలచుట్టూ చెట్లే ప్రాధాన్యం అని చెప్పే కవచం, ఎవరెంత హేళన చేసినా… తన పని తాను చేసుకుంటూ పోయారు. తాను నడిచిన దారిలో మొక్కలను నాటుతూనే వెళ్లారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటం, నాటిన వాటికి నీళ్లు పోయడం ఇదే ఆయన దినచర్య. వన పోషణే తన ప్రథమ ధ్యేయంగా జీవించేవారు. కుటుంబానికి కూడా చాలా తక్కువ సమయమే ఇచ్చేవారు. 50 ఏళ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండేవారు వనజీవి రామయ్య. ఇలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు వనజీవి.