యూపీ పాఠశాలల్లో వందేమాతరం పాడడం తప్పనిసరి
ఉత్తర్ ప్రదేశ్ లో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇకమీదట వందేమాతరంగేయాన్ని తప్పనిసరిగా ఆలపించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ మేరకు గోరఖ్పుర్లో ‘ఏక్తా యాత్ర’ పేరిట నిర్వహించిన సామూహిక వందేమాతరం కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇలా ప్రతీ పాఠశాలలో జాతీయ గేయాన్ని పాడటం ద్వారా.. పిల్లలకు చిన్ననాటి నుంచే దేశభక్తితో పాటు జాతీయ గేయంపై గౌరవభావం వంటివి అలవడతాయన్నారు.
వందేమాతరంను వ్యతిరేకించే వారు దేశ ఐక్యత, సమగ్రతను అవమానించినట్టేనని ఈ సందర్భంగా యోగి అన్నారు. దేశంలో నివసించే ప్రతి పౌరుడూ విధేయతగా, ఐక్యత కోసం పనిచేయాలని కాంక్షిస్తున్నట్టు ఆయన చెప్పారు. కులం, ప్రాంతం, భాషల పేరుతో సమాజాన్ని విభజించే వంటి అంశాలను గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని వ్యతిరేకించాలని యోగి సూచించారు. ఇలాంటి విభజనలు కొత్త జిన్నాలను సృష్టించే కుట్రలో భాగమని అని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో నూతన జిన్నాలకు తెరలేపకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.