వర్మీ కంపోస్టు తయారీతో సంపాదన… ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ పంచాయతీ…
చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేయడంలో భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం రంగయ్యపల్లి ఇందుకు ఆదర్శంగా నిలుస్తోంది. స్థానికంగా వుండే ఓ మహిళా ఇందుకు చొరవ తీసుకుంది. ఆమె కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. చెత్త నుంచి చక్కగా వర్మీ కంపోస్టు తయారు చేయడంతో పంచాయతీ ఆధ్వర్యంలో పెంచుతున్న మొక్కలకు ఎరువూ దొరుకుతుంది. అలాగే ఆదాయం కూడా సమకూరుతోంది.
అయితే.. కొన్ని రోజులుగా ఈ గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్ నిరుపయోగంగా వుండిపోయింది. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఈ అధికారి ఈ గ్రామానికి బదిలీపై వచ్చారో… కాస్త చొరవ చూపించారు. గతంలో ఆమె పని చేసిన ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్టుపై గ్రామస్థులకు, అధికారులకు అవగాహన కల్పించారు. శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించార. తడి, పొడి చెత్తను వేర్వేరు చేయడం, దానిని ప్రాసెసింగ్ చేయడం, వర్మీ కంపోస్టు తయారీపై అత్యంత శ్రద్ధతో శిక్షణనిప్పించారు.
అయితే ఈ శిక్షణను కొంత మంది మాత్రమే ఫాలో అయ్యారు. కానీ… మరింత శ్రద్ధ వహించి, వారిని ఫాలో చేయడంతో ఇప్పుడు వర్మీ కంపోస్టును బాగా తయారు చేస్తున్నారు. చెత్తలో వున్న ప్లాస్టిక్ వస్తువులు, సీసాలను వేరు చేసి, కూడా అమ్ముతున్నారు. దీంతో గ్రామ పంచాయతీకి 5 వేల వరకూ ఆదాయం వచ్చిందట.
తడి చెత్తను సెగ్రిగేషన్ షెడ్ లో వానపాములున్న ఓ ప్రాంతంలో వుంచుతారు. 45 నుంచి 60 రోజుల వరకూ నీళ్లు చల్లుతారు.తర్వాత ఆ ప్రాంతం నుంచి దానిని బయటికి తీసి, ఎండబెట్టి, నీళ్లు చల్లుతారు. ఆ తర్వాత ఎరువుగా మారిపోతుంది. దీనిని సంచుల్లో నిల్వచేస్తారు. దీనిని చెట్లకు, మొక్కలకు వేస్తున్నారు. అలాగే అవసరమున్న గ్రామ పంచాయతీలకు, రైతులకు 10 రూపాయలకు కిలో చొప్పున అమ్ముతున్నారు. దీంతో గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా వస్తోంది. ఇతర గ్రామపంచాయతీ అధికారులు కూడా ఈ సక్సెస్ స్టోరీని తెలుసుకోవడానికి వస్తున్నారు.