ధర్మ రక్షణ కోసం మరింత విస్తరిద్దాం : VHP తీర్మానం
ధర్మరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ ను విస్తరించాలని ఆ సంస్థ పెద్దలు నిర్ణయించారు. గ్రామాలు, తండాలు, గిరి ప్రాంతాలలో కూడా విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రచించాలని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈనెల 22,23,24 తేదీలలో జరిగాయి.. భాగ్యనగర్ శివారు ప్రాంతంలోని అన్నోజిగూడా లో గల రాష్ట్రీయ విద్యా కేంద్రం సమావేశాలకు వేదికైంది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ అఖిలభారత సంఘటన సహ కార్యదర్శి వినాయకరావు దేశ్ పాండే , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ , దక్షిణ భారత సంఘటన కార్యదర్శి శ్రీ స్థాను మలయన్, భాగ్యనగర్ క్షేత్ర సంఘటన కార్యదర్శి గుమ్మల్ల సత్యం, భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి శ్రీ తనికెళ్ళ సత్య రవికుమార్ గారు మార్గదర్శనం చేశారు. VHP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి అధ్యక్షతన కొనసాగిన సమావేశాలను రాష్ట్ర కార్యదర్శి శ్రీ లక్ష్మీ నారాయణ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో విశ్వహిందూ పరిషత్ బలం పెరిగితే మతమార్పిడి ఆగిపోతుందని చెప్పారు. హిందూ సమాజంపై విద్వేషపూరిత కుట్రలు కొనసాగుతున్న ఈ సందర్భంలో, వాటిని తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసి, కుటుంబ విలువలను పరిరక్షించాలని వివరించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లల అలవాట్లు, వ్యవహారంపై నిఘా పెట్టాలని పేర్కొన్నారు. ప్రతి హిందూ కుటుంబంలో జనాభా పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జనాభా తగ్గితే ఎదురయ్యే సమస్యలు, ప్రమాదాలపై వివరించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.

కులాల మధ్య అంతరాలను చెడిపేసి, సామాజిక సమరసతను కాపాడాలన్నారు. ప్రతి వ్యక్తిలో భారతీయత, స్వదేశీ భావజాలం కలిగి ఉండాలన్నారు. ప్రతి హిందువు చైతన్యవంతమై మతమార్పిడి, లవ్ జిహాద్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలని నాయకులు అభిప్రాయపడ్డారు. మూడు రోజులపాటు కొనసాగిన పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు రాష్ట్రంలోని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఆ పై స్థాయి బాధ్యతగల కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ గతమైన వ్యవహారాలపై చర్చించారు.