ప్రభుత్వంపై ఆధారపడకుండా కాలనీలను హరితహారంగా మార్చేసుకున్న ప్రజలు
ప్రతి చిన్న విషయానికీ ప్రభుత్వంపై ఆధారపడటం అనేది సరైన విధానం కాదు. పౌరునికి హక్కులతో పాటు విధులు కూడా వున్నాయి. రోజు రోజుకీ ప్రకృతిలో వేగంగా మార్పులు వస్తున్నాయి. పైగా ప్రస్తుతం నడిచేది ఎండాకాలం. మరింత వేడిగా వుంటుంది. దీంతో ప్రభుత్వం వచ్చి ఏదో చేస్తుందని చూస్తూ కూర్చోలేదు కాలనీ వాసులు. తమంత తాముగా ఓ సమూహంగా ఏర్పడ్డారు. తమ కాలనీల్లో నాటడానికి మొక్కలు కొనుక్కున్నారు. వారందరూ తలా కొన్ని డబ్బులు జమ చేసుకొని, వీటిని కొనుగోలు చేశారు. మొక్కలు నాటి, నీరు పోస్తూ వచ్చారు. అవి కాస్త పెరిగి పెద్దయ్యాయి. ఉద్యానవనం లాగే తయారైంది. ఈ ఎండా కాలంలో వారికి చల్లదనాన్ని పంచుతూ, ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతున్నాయి.
ఇలా పది మందికి ఆదర్శవంతంగా నిలిచారు వనపర్తిలోని కృష్ణదేవరాయ నగర్ కాలనీ వాసులు. అలాగే పార్కులను కూడా అభివృద్ధి చేసుకున్నారు. సొంతంగా డబ్బులు జమ చేసి, వాటి ద్వారా మొక్కలను నాటారు. ఇతరత్రా అవసరాలు కూడా ఇందులోంచే తీసుకున్నారు. అలాగే మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన జిమ్ నిర్వాహణ బాధ్యతను కూడా వీరే తీసుకోవడం విశేషం. పరికరాలు బాగో లేకపోవడంతో సొంత ఖర్చులతో బాగు చేయించుకొని ఆరోగ్యం కోసం శ్రమిస్తున్నారు. ఇక… కాలనీల్లో, పార్కులో వున్న అవసరాలను కూడా వీరే తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా… తమ సమాజాన్ని తామే బాగు చేసుకుంటున్నామని, తమ అవసరాలను తామే తీర్చుకుంటున్నామని కాలనీ వాసులు పేర్కొన్నారు.