రైతులకు ‘వెదర్ మ్యాన్’ సమాచారం
మన దేశంలో వ్యవసాయం వాతా వరణంపై ఆధారపడి ఉంటుంది. వర్షకాలంలో వర్షపు చినుకులు మొదలవగానే రైతులు తమ పంటపొలాలను దున్ని విత్తనాలు జల్లి సేద్యాన్ని ప్రారంభిస్తారు. వాతావరణానికి అనుగుణంగా రైతులు వ్యవసాయాన్ని చేస్తుంటారు. అయితే వాతావరణం ఏ సమయంలో ఎలా ఉంటుందో అంచనా వేయడం చాల కష్టం. జోరుగా వర్షం కురిసినా.., బలమైన గాలులు వీచినా సామాన్య ప్రజలకన్నా… రైతులు, మత్స్య కారులకు తీవ్ర నష్టం మాత్రం తప్పదు. అయితే వాతావరణ పరిస్థితులు రైతులు, మత్స్య కారులు, సామాన్య ప్రజలకు అవగాహన ఉంటే చాల ఉపయోగకరంగా ఉంటుంది. కానీ వాతారణాన్ని అర్ధమైయ్యే రీతిలో చెప్పే వారు ఉండరు. ఇలాంటి సమస్యలను అదిగమించడానికి ఆంధప్రదేశ్కు చెందిన ‘‘సాయి ప్రణీత్’’ తన పరిశోధనల ద్వారా టెక్నాలజీని ఉపయోగించి రైతులకు వాతావరణ సమాచారాన్ని అందజేస్తూ వెదర్ మ్యాన్గా రైతుల వ్యవసాయానికి సహకారం అందజేస్తున్నాడు.
ఆంధప్రదేశ్లోని తిరుపతికి చెందిన 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయి ప్రణీత్ ప్రతిరోజూ తెలుగు ఛానెల్స్ అందించే వాతావరణ సమాచారం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని గ్రహించిన సాయి ప్రణీత్ రైతులు పంట నష్టపోకుండా ఉండాలంటే వాతావరణ సూచనల్లో కచ్చితత్వం ఉండాలనుకున్నాడు. ఈ ఆలోచనతోనే రైతులకు ఎంతో ఉపయోకరంగా ఉండే ఏపీ వెదర్ మ్యాన్ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా రైతులకు ప్రణీత్ అందిస్తున్నాడు. ఇటీవల వచ్చిన అల్పపీడనాలు, భారీ వర్షాల గురించి ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసిన ప్రణీత్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాతావరణ సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నాడు.
సాయికి చిన్నప్పటి నుంచే వాతావరణ విశేషాలు చదవడమంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తే ‘ఆంధప్రదేశ్ వెదర్ మ్యాన్’ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించేలా చేసింది. ఒక పక్క వాతావరణ సూచనలు చేస్తూనే- ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తు న్నాడు. బాల్యం నుంచే వాతావరణ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు చదివేవాడు.
సాయికి జావా, పైథాన్ వంటి కోడింగ్ భాషలపై పట్టు ఉండటంతో వాటిని ఉపయోగించి న్యూ కోడ్ రాశాడు. ఇది వివిధ సైట్ల నుంచి సంబంధిత వాతావరణ డేటాను సేకరిస్తున్నాడు. ఆ జ్ఞానంతోనే స్వయంగా ‘ఆంధప్రదేశ్ వెదర్ మ్యాన్’ ఛానెల్లో వాతావరణ సూచనలు చేస్తున్నాడు. వెబ్సైట్స్ అందించే వాతావరణ డేటాను అధ్యయనం చేసి జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా వేరుచేసి రైతులకు వాతావరణ సూచనలు అందిస్తున్నాడు. తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ మైక్రో మెసేజ్లతో డిజిటల్ మ్యాప్లను ఉపయోగించి వివరణాత్మకమైన సూచనలు ఇస్తున్నాడు. యూట్యూబ్, ఫేస్బుక్ల్లోనూ అతని వీడియోలు ప్రసారమవుతున్నాయి. పది మంది అనుచరులతో ప్రారంభమైన అతని ఛానల్ను ప్రస్తుతం ఆరు వేలకు పైగా అనుసరిస్తున్నారు. విశేషమేమంటే సంవత్సర కాలంలో అతను సాధించిన కృషిని గుర్తించి యూఎన్ హాబిటాట్ జర్నల్ జూన్ సంచికలో అతడి గురించి ప్రచురించింది.
ప్రధాని ప్రశంసలు
సాయి ప్రణీత్ అందిస్తున్న సేవలను తెలుసుకున్న ప్రధాని మోడీ.. జూలై నెల చివరి ఆదివారం రోజున ప్రసారమైన మన్కీ బాత్ కార్యక్రమంలో అతని పేరును ప్రస్తావిస్తూ ప్రశంసించారు. వాతావరణ మార్పులను అధ్యయనం చేసి, రైతులను అప్రమత్తం చేస్తున్న తీరును కొనియాడారు.
గత ఏడేళ్లుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తున్న సాయి ప్రణీత్ భారత వాతావరణ శాఖ(ఐఎండీ), ఐక్యరాజ్యసమితి ప్రశంసలు కూడా అందుకున్నాడు.
మన్ కీ బాత్లో ప్రధాని మోదీ తన పేరును ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉందని ‘ఏపీ వెదర్మ్యాన్’ సాయి ప్రణీత్ అన్నారు. ‘ఏపీలో వాతావరణ వివరాలను రోజూ ఉదయం 8.30 గంటలకు బ్లాగ్లో పోస్టు చేస్తున్నా. ఆకస్మికంగా జరిగే వాతావరణ మార్పులను కూడా పోస్టు చేస్తా. గత ఏడాది నుంచి వాతావరణ వివరాలను రైతులకు అందజేస్తున్నానని ప్రణీత్ తెలిపారు.