ఎన్ఆర్సి ఎప్పుడు?
దేశంలో పౌరుల జాతీయ జాబితా (NRC) అవసరం మరోసారి బయటపడింది. బంగ్లాదేశ్ నుండి మన దేశంలోకి ప్రవేశించి వివిధ ప్రాంతాల్లో సాధారణ పౌరులుగా చెలామణి అవుతున్న చొరబాటుదారుల సంఖ్య చాలానే ఉంటుంది. వీరి మూలంగా ఆయా ప్రాంతాల్లో సామాజిక సమస్యలతోపాటు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న 40 మంది బంగ్లాదేశీయులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. భివాండి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో వీరంతా పని చేస్తున్న 40 మంది బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద సరైన ధ్రువపత్రాలు లేవని స్పష్టంగా పోలీసులు గుర్తించారు.
నిందితుల వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులు, పాస్పోర్టులు, పాన్ కార్డులు, రూ.94 వేల విలువచేసే 28 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ముంబై, గుజరాత్, భివాండి చిరునామాలతో నకిలీ పత్రాలు ఉన్నాయని వెల్లడించారు. వారు తమ బంధువులు, సరిహద్దులు దాటించిన వ్యక్తితో ఐఎంపీవో యాప్ సహాయంతో మాట్లాడుతున్నారని చెప్పారు. వారందరిపై కేసు నమోదుచేశామన్నారు.
భివాండిలోని మూడు వేర్వేరు పోలీసు స్టేషన్ పరిధిల్లో వారు ఇన్ని రోజులు నివసించారు. భివాండిలోని జోన్ 2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) యోగేష్ చవాన్ మాట్లాడుతూ.. అరెస్టు చేసిన వ్యక్తులు వేర్వేరు ప్రదేశాలలో కార్మికులుగా పనిచేస్తున్నారని తెలిపారు. భారత్లో ఉండేందుకు వారి వద్ద సరైన పత్రాలు లేవని చెప్పారు. భారత పాస్పోర్ట్ చట్టం, విదేశీ పౌరుల చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.