పహల్గామ్పై న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనం..
పహల్గామ్ ఉగ్రదాడిని పాకిస్థాన్ తప్ప ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండిస్తోంది. ప్రపంచ అగ్ర నేతలంతా ప్రధాని మోడీకి ఫోన్ చేసి సంఘీభావం తెలుపుతున్నారు. అత్యంత ఘోరంగా పహల్గామ్లో మారణహోమం జరిగి కళ్లకు ప్రత్యక్షంగా కనబడుతుంటే.. న్యూయార్క్ టైమ్స్కు మాత్రం కళ్లు కనిపించడం లేదు. పట్టపగలు.. అంత ఘోరంగా నరమేధం జరిగితే.. న్యూయార్క్ టైమ్స్ మాత్రం తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. అంతేకాకుండా ఒక బహిరంగ సభలో ఉగ్రవాదుల అంతు చూస్తామంటూ ప్రకటించారు. ఇంత స్పష్టంగా ఉగ్రదాడిని చెబుతుంటే.. న్యూయార్క్ టైమ్స్ మాత్రం మిలిటెంట్ దాడిగా కథనాన్ని ప్రచురించింది.
అయితే ఈ కథనంపై అమెరికా హౌస్ ప్యానెల్ మెజార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. తప్పుడు కథనాన్ని ప్రచురించిందంటూ అమెరికా హౌస్ ప్యానెల్ఎక్స్ హ్యాండిల్లో ఈ మేరకు పోస్టు చేసింది. దాడి చేసిన వారిని ‘టెర్రరిస్టు’లుగా కాకుండా తప్పుదోవ పట్టించేలా ‘మిలిటెంట్లు’గా చిత్రీకరిస్తూ శీర్షిక ప్రచురించడంపై ధ్వజమెత్తింది. వార్తలో మిలిటెంట్లు, గన్మెన్లు(సాయుధులు) అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఒక సాధారణ కాల్పుల ఘటనగా పహల్గామ్ను ఉద్దేశించి రాసుకొచ్చింది. వార్త క్లిప్పింగ్ను ఎర్రటి అక్షరాలతో సరిచేసిన అమెరికా హౌస్ ప్యానెల్ కమిటీ ఎక్స్లో పోస్టు చేసింది. ‘‘హేయ్ న్యూయార్క్ టైమ్స్. నీ కోసం ఈ తప్పు మేము సరిచేశాము. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ‘ఉగ్రదాడి’. ఏది ఏమైనప్పటికీ భారత్ లేదా ఇజ్రాయెల్లో జరిగే ఉగ్రవాదం విషయంలో న్యూయార్క్ టైమ్స్ నిజాలను మాయం చేస్తుంది’’ అంటూ అమెరికా హౌస్ ప్యానెల్ కమిటీ ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉంటే పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ దాడి చేసింది తామేనని ప్రకటించింది. ఈ సంస్థ నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా ఉంది. దాడి చేసింది తామేనని చెప్పినప్పటికీ న్యూయార్క్ టైమ్స్కి మాత్రం మిలిటెంట్ దాడిలా కనిపించిందా? అంటూ అమెరికా హౌస్ ప్యానెల్ కమిటీ మండిపడింది.
మిలిటెంట్కు ఉగ్రవాదం మధ్య వ్యత్యాసం ఇదే
సాధారణంగా మిలిటెంట్స్ అనేది రాజకీయ లేదా సామాజిక ఫలితాన్ని ఆశించి రాష్ట్రం లోపల జరిగే సాయుధ తిరుగుబాటును మిలిటెంట్గా సూచిస్తోంది. కానీ ఉగ్రవాదం అలాంటిది కాదు. భారీ లక్ష్యంతో జరిగించేదాన్ని ఉగ్రవాదం అంటారు. ఇందులో హింస, రక్తపాతం ఉంటుంది. దీని కోసం అసమాన యుద్ధం జరుగుతుంది. ప్రస్తుతం పహల్గామ్ ఘటన కూడా అలాంటి ఉద్దేశంతో జరిగించిందే. కానీ న్యూయార్క్ టైమ్స్ మాత్రం ఒక మిలిటెంట్ దాడిగా అభివర్ణించింది. కథనం తీరుపై అమెరికా ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.