‘‘ఆపరేషన్ సిందూర్’’.. పేరు పెట్టింది ఇందుకే
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని తొమ్మిది ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. అయితే.. దీనికి ఆపరేషన్ సిందూర్ అని నామకరణం ఎందుకు చేశారు? అన్నది చర్చనీయాంశంగా మారింది.
నిజానికి ఆపరేషన్ సిందూర్ అని ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆపరేషన్ సింధూర్’.. ఈ పేరు పెట్టడానికి అసలు కారణం పహల్గామ్ ఉగ్రదాడి. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో మొత్తం 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 ఏళ్ల ఓ నేవీ అధికారి వినయ్ మరణించాడు. అతడిని పెళ్లి జరిగిన కేవలం ఐదు రోజులకే టెర్రరిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు. భర్త వినయ్ మృతదేహం వద్ద గుండెలవిసేలా భార్య హిమాన్షి ఏడుస్తున్న ఫొటో దేశం మొత్తాన్ని కదిపేసింది. ఈ ఉగ్రదాడిలో హిమాన్షితో పాటు చాలా మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. మన ఆడబిడ్డల నుదుటిన సిందూరాన్ని ఇస్లామిక్ ఉగ్రవాదులు తుడిచేశారు. దానికి ప్రకతీకారంగానే ఈ దాడి అని చెబుతున్నారు. అందుకే ఈ ఆపరేషన్ కి సిందూర్ అని నామకరణం చేశారు.