భారత్, పాక్ యుద్ధం వస్తే ఇంగ్లాండ్ వెళ్లిపోతా : పాక్ ఎంపీ మాటలు వైరల్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య తీవ్ర పరిణామాలు ప్రారంభమయ్యాయి. నదీ జలాల విషయాల్లో గానీ, సోషల్ మీడియా విషయంలో గానీ భారత ప్రభుత్వం కఠన నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు యుద్ధం వస్తుందంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి చెందిన ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఒకవేళ యుద్ధం అంటూ వస్తే మీరు పోరాడతారా? అని పాక్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మార్వత్ ని విలేకరులు అడగ్గా… ‘‘యుద్ధం భీకరమైతే మాత్రం నేను ఇంగ్లాండ్ కి వెళ్లిపోతా’’ అని అత్యంత తేలిగ్గా సమాధానమిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. పాకిస్తాన్ రాజకీయ నేతలు తమ సొంత సైన్యాన్ని కూడా నమ్మరంటూ సెటైర్లు పడుతున్నాయి.
అలాగే మరో ప్రశ్న కూడా విలేకరులు అడగ్గా… భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్రిక్తతలను తగ్గిస్తారా? అని అడగ్గా… ‘‘ఆ… మరి.. మోదీ నా అత్త కొడుకు కదా.. నేను చెప్పినంత మాత్రాన అతను వెనక్కి తగ్గుతారా?’’ అని చమత్కరించారు.నిజానికి మార్వాత్ ఒకప్పుడు ఇమ్రాన్ పార్టీ PTI లో సీనియర్ గా చెలామణి అయ్యారు. కానీ.. పార్టీని అనేక సార్లు విమర్శించడంతో ఆయన్ను పార్టీ బాధ్యతల నుంచి పక్కకు తప్పించారు.