ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో ఇస్లామిక్ ఉగ్రవాది యాసిన్ మాలిక్కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. తనపై మోపిన అన్ని అభియోగాలను ఇంతకు ముందు అంగీకరించిన మాలిక్కు 10 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది.
లోయలో కాశ్మీరీ పండిట్ల మారణహోమం, వలసలకు యాసిన్ మాలిక్ కారణమని తెలుపుతూ అతనికి ఉరిశిక్ష విధించడమే సరైన శిక్ష అని ఎన్ఐఏ కోర్టుకు సూచించింది. న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు నిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టిన ఇస్లామిక్ ఉగ్రవాది యాసిన్ మాలిక్ నేరాన్ని అంగీకరించిన తర్వాత NIA కోర్టు గురువారం (మే 19) దోషిగా నిర్ధారించింది. నివేదికల ప్రకారం చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద సెక్షన్16 (ఉగ్రవాద చట్టం), 17 (ఉగ్రవాద చర్యకు నిధులు సేకరించడం), 18 (ఉగ్రవాదచర్యకు కుట్ర),20 (సభ్యుడిగా ఉండటం). ఐపిసీ సెక్షన్లు 120-B (నేరపూరిత కుట్ర) 124-A (విద్రోహం)కింద కేసులు నమోదయ్యాయి.
2017లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో తనపై మోపిన అన్ని అభియోగాలను యాసిన్ మాలిక్ అంగీకరించాడు. యాసిన్ మాలిక్ ఆర్థిక మదింపునకు సంబంధించి అఫిడవిట్ను కూడా కోర్టు కోరింది. యాసిన్ మాలిక్తో ముడిపడి ఉన్న కేసు 2017లో జరిగిన ఉగ్రవాద, వేర్పాటు వాద కార్యకలాపాలకు సంబంధించినది.
1990లలో కాశ్మీర్లో వేర్పాటువాద కార్యకలా పాల్లో యాసిన్ మాలిక్ కీలక పాత్ర పోషించాడు. 1990 ప్రారంభంలో JKLF తీవ్రవాది మక్బూల్ భట్, IAF అధికారుల హత్యకు మరణశిక్ష విధించిన జస్టిస్ నీలకంఠ్ గంజును చంపడంలో ఇతని పాత్ర ఉంది. 2017లో తెరిచిన తీవ్రవాదా నికి నిధులు సమకూర్చిన కేసులో 2019లో యాసిన్ మాలిక్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కాశ్మీర్లో సమ్మెలు, నిరసనలు నిర్వహించడం, పాఠశాలలను తగలబెట్టడం, రాళ్లతో దాడి చేయడం ద్వారా ఇబ్బందులను సృష్టించేందుకు వేర్పాటువాద నాయకులు పాకిస్తాన్, లష్కరే తోయిబా, హిజ్-ఉల్-ముజాహిదీన్తో సహా ఉగ్రవాద సంస్థల నుండి నిధులు పొందారని NIA తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. యాసిన్ మాలిక్ 2016లో లోయలో హింసాత్మక నిరసనలకు నాయకత్వం వహించడానికి అన్ని వేర్పాటువాద సమూహాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడని ఎన్ఐఏ పేర్కొంది.