కఠోర క్రమశిక్షణ, మితమైన ఆహారం.. యోగా గురువు శివానంద జీవితం ఆదర్శం

ప్రముఖ యోగా గురువు శివానంద (128) ఆదివారం రోజు ఉదయం వారణాసిలో కన్నుమూశారు. శివానంద యోగా రంగంలో విశేష సాధన చేశారు. దేశంలోనే అపార అనుభవం కూడా సాధించి, యోగా విస్తరణకు విశేషంగా కృషి చేశారు. యోగా రంగంలో విశేష కృషికి గాను, భారత ప్రభుత్వం 2022 లో ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. తెల్లని ధోవతి, కుర్తా ధరించి, పద్మ శ్రీ అవార్డు తీసుకుంటున్న సమయంలో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించారు.

స్వామి శివానంద సరస్వతీ ఆగస్టు 8, 1897న అవిభక్త భారతదేశంలోని (ప్రస్తుత బంగ్లాదేశ్) సిల్హెట్ జిల్లాలో జన్మించారు. స్వామి శివానంద ఆరేళ్ల వయసులో తన తల్లి మరియు తండ్రి ఇద్దరినీ కోల్పోయారు మరియు వారి అంత్యక్రియల తర్వాత, ఆయనను నబద్వీప్ (పశ్చిమ బెంగాల్)లోని గురూజీ ఆశ్రమానికి తీసుకువచ్చారు. గురువు ఓంకారానంద గోస్వామి దగ్గరే పెరిగారు. పాఠశాల విద్య లేకుండానే యోగాతో సహా అన్ని ఆధ్యాత్మిక విద్యలను బోధించారు.ఆయన ఓ వైపు సంప్రదాయ యోగ విద్యను ఉపాసిస్తూనే, మరికొన్ని సంప్రదాయ విద్యలను కూడా ఉపాసన చేశారు. అలాగే సామాజిక సేవను కూడా చేసేవారు. గత 50 సంవత్సరాలుగా, స్వామి శివానంద 400 నుండి 600 మంది కుష్టు వ్యాధిగ్రస్తులైన యాచకులను వారి గుడిసెలలో కలుసుకుని వారికి సేవ చేశారు.

స్వామి శివానంద జీవించినంత కాలం శాకాహారి. మితంగా ఆహారం తీసుకునేవారు. అత్యంత క్రమశిక్షణతో కూడి జీవితాన్ని గడిపేవారు. ఎందుకంటే యోగా చేయడానికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరం. దానికి గాను ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే ఎక్కువగా పాలు, పండ్లను మాత్రమే తీసుకునేవారు. నూనెను అస్సలు తీసుకునేవారే కాదు. ‘‘నూనె, మసాలాలు తీసుకోను. ఉడికించిన ఆహారం, బియ్యం, పప్పు, రెండు పచ్చి మిరపకాయలు, చపాతీలు, ఆలూ చోఖా మాత్రమే తింటాను. డబ్బు వెంట అస్సలే పరగెత్తను. సరళమైన ఆహారం, క్రమశిక్షణ, కోరికలు లేని జీవితాన్నే గడుపుతారు. భజన చేస్తుంటాను. అది మనస్సును ప్రశాంతంగా వుంచుతుంది కూడా.’’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అలాగే ఆయన జీవిత విధానం కూడా ఆదర్శవంతమే. గత 43 సంవత్సరాలుగా ఆయన వారణాసిలోని దుర్గా మందిరం సమీపంలో ఒకే ఒక గదిలో నివసిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 3 గంటలకే నిద్ర లేస్తారు. అరగంట పాటు వాకింగ్ చేస్తారు. ఆ తర్వాత ఓ గంట పాటు యోగా, సూర్య నమస్కారాలు చేస్తారు. ఆ తర్వాత రామాయణంతో పాటు గీతాపథ్, చండీ పారాయణం చేస్తారు.రెండు పూటల మాత్రమే భోజనం చేస్తారు. అల్పాహారం అస్సలే ముట్టుకోరు.

యోగాతో పాటు సామాజిక సేవ కూడా…

యోగాతో పాటు ఆయన సమాజ సేవ కూడా చేసేవారు పూరీలో కనీసం 400 నుంచి 600 మంది కుష్టు రోగులకు గుడిసెలలో వెళ్లి మరీ సేవ చేసేవారు. సేవయే పరమ ధర్మం అంటూ అనేవారు. అనేక మానవతా పనులు కూడా శివానంద చేశారు. ఇతరులను కూడా చేయమని ప్రోత్సహించేవారు. శివానందను మోడల్ గా తీసుకొని అనేక మంది యోగా చేసేవారు. అలాగే సామాజిక సేవ కూడా చేసేవారు.

ప్రధాని మోదీ, సీఎం యోగి సంతాపం…

శివానంద మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన ఆధ్యాత్మిక సాధనను, యోగా రంగానికి చేసిన అసమానమైన కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. దేశంలోని ప్రతి తరానికి ఆయన స్ఫూర్తినిస్తూనే వుంటారన్నారు. ఆయన మృతి యోగా రంగానికి తీరని లోటు అని మోదీ పేర్కొన్నారు. ‘‘కాశి నివాసి, యోగా సాధకుడు శివానంద బాబాజీ మరణ వార్త వినడం చాలా బాధాకరం. యోగా సాధనకే తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే వుంటారు. యోగా ద్వారా సమాజానికి సేవ చేసినందుకు ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ఆయన నుంచి ప్రేరణ పొందిన వారందరికీ ఆయన మరణం తీరని లోటే.’’ అని మోదీ సంతాపం ప్రకటించారు.

ఇక.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సంతాపం ప్రకటించారు. కాశీ ప్రఖ్యాత యోగ గురువు పద్మశ్రీ స్వామి శివానంద మరణం అత్యంత విచారకరం. ఆయనకు వినమ్రంగా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఆయన యోగా జీవితం మొత్తం సమాజానికే ప్రేరణ. యోగా విస్తరణకు విశేషంగా కృషి చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *